శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (16:03 IST)

108 అంబులెన్స్ డ్రైవర్లకు భారీగా వేతనం పెంపు : సీఎం జగన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వారిని తక్షణం ఆస్పత్రులకు తరలించే 108 అంబులెన్స్ డ్రైవర్లకు, సిబ్బందికి భారీగా వేతనాలు పెంచారు. 
 
ప్రస్తుతం అంబులెన్స్ డ్రైవర్ల వేతనం రూ.10 వేలుగా ఉంటే, ఈ మొత్తాన్ని ఇక నుంచి రూ.18 నుంచి 20 వేల రూపాయలుగా చెల్లించనున్నారు. అలాగే, అత్యవసర వైద్య, టెక్నికల్ సిబ్బందికి ప్రస్తుత రూ.12 వేల నుంచి సర్వీసును బట్టి రూ.20 నుంచి రూ 30 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
 
బుధవారం గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో కేన్సర్ బ్లాక్‌ను జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 108 సిబ్బంది జీతాలను పెంచబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
 
అంతకుముందు ఆయన బుధవారం విజయవాడలో 1,088 వాహనాలను (108, 104) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సీఎం చేసిన ప్రకటనతో 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఏపీ చరిత్రలో మైలురాయి... 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో మైలురాయి ఇది. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. 
 
అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 1088 అంబులెన్స్‌లను కొనుగోలు చేసిన ఏపీ సర్కారు, వాటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి పంపుతామని వెల్లడించింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద జగన్ పచ్చజెండా ఊపి అన్ని వాహనాలనూ ఒకేసారి ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పుడు మరింతగా విస్తరించామని, 95 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భద్రతపై భరోసాను కల్పించామన్నారు. 
 
ఈ అంబులెన్స్‌ల ద్వారా 108, 104 సేవలు ప్రతి ఒక్కరికీ దగ్గరవుతాయని తెలిపారు. 412 అంబులెన్స్‌లు 108 సేవల్లో భాగంగా అనారోగ్యానికి గురైన వారిని, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరుస్తాయని, మరో 282 అంబులెన్స్‌లు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను కలిగివుంటాయని, మిగతావి అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్టుతో ఉంటాయని జగన్ పేర్కొన్నారు.
 
మరో 26 అంబులెన్స్ లు చిన్నారుల కోసం నియో నేటల్ వైద్య సేవల నిమిత్తం కేటాయించామని, వీటితో పాటు ఇన్ క్యుబేటర్, వెంటిలేటర్లతో కూడిన అంబులెన్స్‌లు కూడా ఉన్నాయని తెలిపారు. 
 
గతంలో ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండగా, ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.