బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (15:31 IST)

జగన్ సర్కారుపై కోర్టు ధిక్కరణ : పిటిషన్ పైల్ చేసిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎస్ఈసీ నియామకం విషయంలో గతంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పాటించలేదనీ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటూ వచ్చారు. అయితే, కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 
 
దీంతో ఆగ్రహించిన సీఎం జగన్.. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆయన పదవీకాలాన్ని కుదించారు. దీంతో ఆయన మాజీ అయిపోయారు. అయన స్థానంలో కొత్త వ్యక్తిని రాష్ట్ర ఎస్ఈసీగా నియమించారు. 
 
దీనిపై నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ఛాలెంజ్ చేయగా, అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. 
 
ఆ తర్వాత కూడా ఏపీ సర్కారు రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డను నియమించలేదు. దీంతో ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని రమేశ్ కుమార్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. 
 
కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని పిటిషన్‌ దాఖలు చేసిన ఆయన.. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.