శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (15:12 IST)

27న నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

ys jaganmohan reddy
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ ప్రారంభోత్సవం కోసం ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ కొత్త యూనిట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత నేలటూరు వేదికగా జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. 
 
జిల్లాలోని ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలో ఏపీ జెన్‌కో ప్రాజెక్టు 800 మెగావాట్‌ల సామర్థ్యంతో మూడో యూనిట్‌ను నెలకొల్పింది. దీన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన నెల్లూరు పర్యటనకు రానుండగా, ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 
 
ఈ పర్యటనలో భాగంగా 27వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.55 గంటలకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 
 
ఉదయం 11.10 గంటలకు నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ఆయన నేలటూరు గ్రామంలోనే ఉంటారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు, ఎస్పీ తదితరులు పాల్గొననున్నారు.