మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 నవంబరు 2022 (11:19 IST)

తూచ్.. మూడు రాజధానులు అక్కర్లేదు... విశాఖే రాజధాని : తేల్చేసిన మంత్రి ధర్మాన

dharmana prasad rao
వైకాపా ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు ముక్కలాటలోని మర్మాన్ని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు బట్టబయలు చేశారు. నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండబోవని, ఏకైక రాజధానిగా విశాఖ నగరం ఒక్కటే ఉంటుందని స్పష్టం చేశారు. పైగా, ఇకపై పాలన అంతా విశాఖ నుంచే సాగుతుందని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 
 
శ్రీకాకుళంలో "మన విశాఖ - మన రాజధాని" పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, అమరావతి రైతుల పాదాయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగివుందన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో కటక్‌లో హైకోర్టు ఉందన్నారు. భువనేశ్వర్‌లో పరిపాలనా రాజధాని ఉందని గుర్తుచేశారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. 
 
మన ప్రాంతం కోసం పోరాటం చేస్తున్న మనల్నే టీడీపీ నేత అచ్చెన్నాయుడు దద్దమ్మలంటూ విమర్శిస్తున్నారని ఆరోపించారు. అస్సలు అచ్చెన్నకు ఏమాత్రం అవగాహన ఉందా? చేతకాకుంటే నోరు మూసుకుని కూర్చోండి. ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేం పోరాడుతాం అని మంత్రి ధర్మాన అన్నారు.