శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 24 జులై 2021 (11:50 IST)

ఏపీలో మ‌రో ఇద్ద‌రు ఉన్న‌ధికారుల‌పై కోర్టు ధిక్కారం కేసు

ఏపీ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఓ కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు తమ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ఒకరు చివరి నిమిషంలో మినహాయింపు కోరగా, మరొకరు అసలు హైకోర్టు ఆదేశాలనే పట్టించుకోలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
 
రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ శంకరాచార్యులుకు ప్రొవిజనల్ పెన్షన్, ఇతర భత్యాలను విడుదల చేయాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను అధఇకారులు అమలు చేయకపోవడంతో, ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టులో ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, అనంతరాముపై కోర్టు ధిక్కార కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వీరిద్దరినీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా వీరిద్దరూ హాజరు కాలేదు.
 
ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ హోదాలో ఉన్న అనంతరాముతో పాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ నిన్న ఈ కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.

అయితే ద్వివేదీ విదేశీ పర్యటనలో ఉన్నందున హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది నిన్న హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. ఇలా చివరి నిమిషంలో హైకోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, పిటిషన్ దాఖలు చేయడం పట్ల న్యాయమూర్తి జస్టిస్ దేనానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఐఏఎస్ అనంతరాము అయితే ఎలాంటి సమాచారం లేకుండా కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో న్యాయమూర్తి ఆయన తీరుపైనా సీరియస్ అయ్యారు.
 
 కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, అనంతరాములను తక్షణం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు గుంటూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. వీరిద్దరిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఇరుకనపడింది. ప్రస్తుతం ద్వివేదీ విదేశీ పర్యటనలో ఉండగా, అనంతరాము మాత్రం ఏపీలోనే ఉన్నారు. దీంతో వీరిద్దరి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది.