శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (12:34 IST)

గుంటూరులో ఆంక్షలు కఠినం : మాస్కులేకుండా బయటకొస్తే జేబుఖాళీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అత్యధిక ప్రభావిత జిల్లాలో గుంటూరు ఒకటి. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలను ప్రభుత్వం రెడ్‌జోన్లుగా ప్రకటించారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లోభాగంగా, తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.వెయ్యి అపరాధం విధించాలని నిర్ణయించారు. 
 
అలాగే, లాక్‌డౌన్‌లో ప్రజలు బయటికి రాకుండా, అత్యవసర పని మీద వచ్చినా కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. 
 
అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకే బయటకు రావాలని సూచించారు. అప్పుడు కూడా మాస్కులు ధరించి, సామాజికదూరం పాటించాలని స్పష్టంచేశారు. 
 
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపు ఆఫీసులకు వెళ్లి.. సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టంచేశారు.