శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:46 IST)

ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు.. దేశంలో 452 మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 572కు చేరింది. శుక్రవారం కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 572కు చేరాయి. ఇకపోతే, ఇప్పటివరకు మొత్తం 14 మంది చనిపోగా, మరో 35 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. 
 
572 మంది కరోనా పాజిటివ్ కేసుల్లో 523 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం గుంటూరులో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు మూడో స్థానంలోనూ, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 
 
ఇకపోతే, దేశంలో కూడా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13835కు చేరగా, ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 452కు చేరింది. ప్రస్తుతం దేశంలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1766 మంది కోలుకున్నట్టు తెలిపింది.