1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (11:04 IST)

అస‌లు విశాఖ రైల్వే జోన్ ఉందా? లేదా? పార్ల‌మెంటులో అలా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజ‌న త‌ర్వాత అన్నింటిలోనూ రాష్ట్ర ప్ర‌జ‌లు రాజ‌కీయాల‌తో న‌ష్ట‌పోతూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా లేదు, ఇటు పూర్తి ప్యాకేజీ లేదు. అటు, ఇటు కాని త్రిశంకు న‌ర‌కంలో ప‌డిపోయింది ఏపీ. ఈ ద‌శ‌లో గ‌తంలో ప్ర‌క‌టించి, రాజ‌కీయంగా ఆర్భాటం చేసిన విశాఖ రైల్వే జోన్ కూడా, ఉందా?  లేదా? అనుమానాస్పంద‌గా మారింద‌ని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. 
 
 
విశాఖ రైల్వే జోన్ పై పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న వ‌చ్చాక‌, ప‌రిస్థితి ఏంటో ప్ర‌జ‌లకు స్ప‌ష్టం చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లు ఉన్నాయని, కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన లేదని రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. నిన్న రైల్వే మంత్రి ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది.


2019 ఫిబ్రవరిలో నాటి రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించిన విషయం గమనిస్తే, అస‌లు విశాఖ రైల్వే జోన్ ఉందో, లేదో తెలియ‌డం లేద‌ని రామ‌కృష్ణ అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ అంశంపై ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఇప్పటికైనా గళమెత్తాల‌ని, విశాఖ రైల్వే జోన్ సాధించేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.