శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో చచ్చిన బొద్దింక కనబడింది. దీనితో భక్తులు ఆందోళనకు దిగారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో బొద్దింకలు వుండటమేమిటంటూ నిలదీశారు. దీనితో సిబ్బంది ఆ లడ్డూను తీసుకుని పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని వీడియో తీస్తుండగా వారిని వారించినట్లు సమాచారం.
లడ్డూలో బొద్దింక వున్న విషయాన్ని బైటకు రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు లడ్డూ ప్రసాదంలో బొద్దింక వున్నదన్న సమాచారం ఆలయ ఈవో శ్రీనివాస రావు దృష్టికి వెళ్లింది. దీనితో ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన... ఈ బొద్దింక నిజంగానే లడ్డూలో వున్నదా లేదంటే ఎవరైనా కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారా అనేది ఆరా తీస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు చెప్పారు.