శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (15:41 IST)

వాయుగుండంగా మారిన అల్పపీడనం - కోస్తాంధ్రకు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్రతో పాటు తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది శుక్రవారం వేకువజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ వాయుగుండం ప్రభావం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్నాటక రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావణ కేంద్రం హెచ్చరించింది. ఈ తుఫాను తీరందాటే సమయంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యుకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.