గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (06:51 IST)

రాజ్యాంగ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారు: నిమ్మగడ్డపై శ్రీకాంత్‌రెడ్డి ఫైర్

రాజ్యాంగ వ్యవస్థలో ఉంటే.. నీతి, న్యాయం పాటించకుండా ఆ వ్యవస్థ ప్రతిష్టను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దిగజార్చుతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వంపై ఏ రకమైన ద్వేషంతో, ఎవరి ప్రేరేపణతో పనిచేస్తున్నారో ఆధారాలతో సహా చూపించామన్నారు. వ్యవస్థలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అపారమైన నమ్మకం, గౌరవం ఉందని, కానీ వ్యవస్థల ముసుగులో ఆడుతున్న నాటకాలతో ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. 
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఒక హోటల్‌లో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రహస్యంగా భేటీ అయిన దృశ్యాలను ప్రజలంతా చూశారన్నారు.

సుప్రీం కోర్టులో వాదించేందుకు గంటకు కోట్లాది రూపాయలు ఫీజులు తీసుకునే లాయర్ల హయర్‌ చేసుకున్నారంటే.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే..!
 
ఈరోజు ఈనాడు పేపర్‌లో బ్యానర్‌ స్టోరీ.. ‘స్థానిక ఎన్నికలకు సిద్ధం.. హైకోర్టుకు నివేదించిన ఎస్‌ఈసీ’ అని రాశారు. హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ ఈరోజు ఫైల్‌ అయినట్లుగా ఉంది. హైకోర్టులో అఫిడవిట్‌ ఫైల్‌ చేయకముందే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి పత్రికలకు లీకేజ్‌ ఇవ్వడంలో నిమ్మగడ్డ ఆంతర్యమేంటీ..? ఇంట్రస్ట్‌ ఏంటీ..?
 
– హైకోర్టులో నివేదించే ఫైల్‌ను ముందుగా ఎందుకు లీక్‌ చేశారు.. ఆ అవసరం ఎందుకు వచ్చింది. ఇటువంటి వ్యక్తి నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాడంటే ఎలా నమ్మాలి..? 
 
– రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఇలా చేయడం దుర్మార్గం. ఇలాంటి వ్యక్తులు వైయస్‌ఆర్‌ సీపీ, గౌరవ ముఖ్యమంత్రిపైన తప్పుడు లేఖలు రాస్తారా..?
 
– వ్యవస్థలను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చౌదరి ముఖ్యమంత్రిగా ఇంకా చంద్రబాబునే ఊహించుకుంటూ, బాబు ఆదేశాలతో పనిచేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. 
 
– సొంత ప్రయోజనాల కోసం ఎందుకు వ్యవస్థలను తాకట్టుపెడుతున్నారు. తన స్వార్థం కోసం తప్పులు చేసి దాన్నే ఒప్పు అనే మనస్తత్వం చంద్రబాబుది. దానికి బాకా ఊదే శక్తులను చూసి పెట్రేగిపోతున్నాడు.  
 
– సిస్టమ్‌ను రిపేర్‌ చేయాలని, అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ వ్యవస్థల గౌరవం పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తుంటే.. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం వ్యవస్థల మేనేజ్‌మెంట్‌కు దిగుతున్నారు. 
 
– రాష్ట్రంలో మూడు కోవిడ్‌ కేసులు ఉన్నప్పుడు కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకరం.. ఉద్యోగుల ఆరోగ్య భద్రత మాటేంటీ..? అని మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఇప్పుడు రోజుకు 3 వేల కేసులపైన వస్తుంటే.. ఇప్పుడంతా సవ్యంగా ఉందని మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటీ..?
 
– తన మాట వినలేదని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు కూడా నీతులు మాట్లాడుతున్నారు. 
 
– ఎన్నికలు అంటే భయపడే పరిస్థితి లేదు. కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందజేసి దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్టంగా ఉన్నాం. ఏ రోజు ఎన్నికలు పెట్టినా ఏకపక్షంగా విజయం సాధిస్తాం. కానీ, స్వార్థపూరిత వ్యక్తితో కలిసి నిమ్మగడ్డ చేసే పనులను ప్రశ్నిస్తున్నాం. 
 
– ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇష్టం వచ్చినట్లుగా కలెక్టర్లు, ఎస్పీలను ట్రాన్స్‌ఫర్‌ చేసుకొని వ్యవస్థను నీ గుప్పెట్లో పెట్టుకొని చంద్రబాబుకు అనుకూలంగా పనిచేయాలనే ఆలోచన నిమ్మగడ్డకు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మాట ఆధారాలతో సహా చెబుతున్నాం. 
 
– మూసేసిన పార్టీని ఇంట్లో నుంచి బయటరాని నాయకుడు. జూమ్‌ మీటింగ్‌లు పెట్టి.. వరి పొలాలకు, చేపల చెరువులకు తేడా తెలియని లోకేష్‌ను పంపించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. 
 
– ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే.. రాష్ట్రం నష్టాలకు పోతున్నట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ వారితో మీటింగ్‌ పెట్టి.. ఐఐటీ విద్యార్థులు, డాక్టర్లు, మేధావులు అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 
 
– అమరావతిలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన బుద్ధ విగ్రహాన్ని చూపిస్తూ గ్రాఫిక్స్‌తో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన చంద్రబాబు ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడడం హేయం. 
 
– తన పాలనలో దుర్గ గుడి ఫ్లైఓవర్‌ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు పోలవరం నిర్మాణం గురించి మాట్లాడడం విడ్డూరం. పోలవరం సందర్శన పేరుతో రూ.800 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడు. 
 
–టిడ్కో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని మాట్లాడుతున్నాడు.. వెన్నుపోటు పొడిచి టీడీపీ లాక్కున్నట్లుగా కాదు. పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. కేసులు వేయించి ప్రజలకు ఇళ్ల పట్టాలు దక్కకుండా చేస్తుంది చంద్రబాబే. 
 
– పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మహానేత వైయస్‌ఆర్, అనుమతులు తీసుకువచ్చింది వైయస్‌ఆర్‌.. కాల్వలు పనులను పూర్తి చేసింది వైయస్‌ఆర్‌.. మహానేత చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారు.