శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (19:13 IST)

రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా... ఎలాగంటే? చంద్రబాబు నాయుడు

అమరావతి : ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోవడమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమ ముఖ్యోద్దేశమని, ఈ కార్యక్రమాన్ని పండగలా జ

అమరావతి : ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోవడమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమ ముఖ్యోద్దేశమని, ఈ కార్యక్రమాన్ని పండగలా జరుపుకుందామన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి పది రోజుల పాటు సాగే జన్మభూమి కార్యక్రమంలో పది జిల్లాల్లో పర్యటించినున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి లక్షా 80 వేల సమావేశాలు నిర్వహించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 
 
సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల్లో స్ఫూర్తి నింపే విధంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ప్రజలను భాగస్వాములు చేసి, పుట్టిన ఊరును అభివృద్ధి చేసుకోడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచడానికి కూడా వీలుకలుగుతోందన్నారు. అదే సమయంలో పుట్టిన ఊరును, రాష్ట్రానికి విడిచి దేశ విదేశాల్లో ఉన్నవారు తమ జన్మభూమిని అభివృద్ధి చేసుకోడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. 
 
గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఎందరో ఎన్ఆర్ఐలు, ఇతరులు తమ గ్రామాల్లో పాఠశాలలు, హాస్పిటల్ భవనాలు నిర్మించారన్నారు. మరెందరో తాగునీరు, రోడ్డు సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు జన్మభూమి కార్యక్రమాన్ని మోడల్‌గా తీసుకుని తమ దేశాల్లో అమలు చేశాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రయాణం ఎన్నో ఒడుదుడుకులతో ప్రారంభమైందన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. వారి సాయంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. అందుకోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి అయిదో విడత జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
 
పండగలా జరుపుకుందాం...
ఇప్పటికే క్రిస్మస్ పండగను నిర్వహించుకున్నామని, మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం సంబరాన్ని, వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగను పెద్దఎత్తున నిర్వహించుకోబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇన్ని పండగల మధ్య జనవరి రెండో తేదీ నుంచి నిర్వహించబోతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కూడా మరో పండగలా నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కొత్త పంట చేతికందికొచ్చే దశలో సంక్రాంతి పండగను చేసుకుంటామని, పిండివంటలు వండుకుని పెద్దల దీవెనలు తీసుకుంటామన్నారు. 
 
పశువులను కూడా పూజించి, ప్రకృతిని కూడా ఆరాధిస్తామన్నారు. ఇంతటి ఆనందకర సమయంలో గ్రామం, రాష్ట్రం గురించి చర్చించుకోవడం అందరి బాధ్యత అన్నారు. గతాన్ని నెమరువేసుకుని, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇందుకోసమే జన్మభూమి కార్యక్రమం కింద 10 రోజుల పాటు పలు సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే ఇంటింటికీ తెలుగుదేశం, కనెక్ట్ సీఎం యాప్, 1100 ద్వారా ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు వచ్చాయన్నారు. ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్ సమస్యలను గుర్తించి, ప్రాధాన్యతపరంగా ఆయా సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నాన్ ఫైనాన్సియల్ సమస్యలు వంద శాతం పరిష్కాయ్యేలా కృషి చేస్తామన్నారు. 
రోజువారీ అంశాలు...
మొదటి రోజు సంక్షేమం – సంతృప్తి, 
రెండో రోజు ఆరోగ్యం – ఆనందం, 
మూడో రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్, 
నాలుగో రోజు విద్య – వికాసం, 
అయిదో రోజు గ్రామీణ మౌలిక సదుపాయల కల్పన, 
ఆరవ రోజు సహజ వనరుల అభివృద్ధి, 
ఏడో రోజు వ్యవసాయం అనుంబంధం 
ఎనిమిదో రోజు సుపరిపాలన – టెక్నాలజీ
తొమ్మిదో రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ –పేదరికంపై గెలుపు
పదో రోజు ఆనందలహరి
 
ఇలా ఒక్కో రోజు ఒక్కో అంశంపై ప్రజలతో చర్చిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రతి రోజూ రెండు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 65 వేల సమావేశాలు, 16 వేల గ్రామలు సభలు...మొత్తం లక్షా 80 వేల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. సమావేశంలో అర గంట నుంచి 45 నిమిషాల పాటు గ్రామస్తులతో కలిసి ఆయా గ్రామాల పరిస్థితులపై చర్చంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశాల్లో వచ్చిన ఫిర్యాదులను ఆర్.టి.జి కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తుంటామన్నారు. కొత్త పింఛన్లు, కార్డులు కూడా పంపిణీ చేయనున్నామన్నారు. 
 
చంద్రన్న బీమా పథకం అమలులో భాగంగా రూ.150 కోట్లను బాధిత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేస్తామన్నారు. రుణమేళా పేరుతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా 2 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నామన్నారు. బీమా క్లయిమ్ లు చెల్లిస్తామన్నారు. గతంలో కంటే ఎంతో పగడ్బందీగా అయిదో విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రకృతిని ప్రేమించే భారతీయ సంస్కృతికి కొనసాగింపుగా గతంలో వ్యవసాయాన్ని గౌరవిస్తూ ఏరువాక, నీటిని ఆరాధిస్తూ జలశ్రీ, నీరు-వనం పేరుతో వనమహోత్సవాలు నిర్వహించామన్నారు. ఈ భూ ప్రపంచంలో సూర్యుడి పాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. సూర్యుడి గొప్పతనాన్ని గుర్తిస్తూ, వచ్చే నెలలో సూర్య ఆరాధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.