శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (22:15 IST)

మహిళలపై ఉన్మాద చర్యలను ఉపేక్షించబోము: దిశ ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా

మహిళలపై ఉన్మాద చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని దిశ ప్రత్యేక అధికారి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం ఆందోళనకరమని, మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు.
 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని బాధితురాలి ఇంటికి వచ్చిన కృతికా శుక్లా ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితురాలి కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం చేస్తామని, ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని ఓదార్చారు. నిందితుడిపై దిశ చట్టం స్పూర్తితో వేగవంతంగా దర్యాప్తు పూర్తిచేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని, ఈ తరహా చర్యలకు ముగింపు పలకాలన్న ధ్యేయంతోనే ముఖ్యమంత్రి దిశ చట్టానికి రూపకల్పన చేసారని వివరించారు.
కష్టాలలో ఉన్న మహిళలు ఎవరైనా సహాయ సంఖ్యలు 100/112/181 ఉపయోగించుకోవాలని, మరోవైపు దిశ యాప్, పోలీస్ సేవ యాప్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారు వీటికి సందేశం పంపితే సకాలంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి బాధితులను రక్షించే అవకాశం ఉందని తెలిపారు. దారుణ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మహిళ రక్షణే ప్రభుత్వ ప్రధమ కర్తవ్యమని, నేరాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని డాక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేసారు.