గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (13:46 IST)

చనిపోవాలని ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం.. తేజస్విని కేసులో ట్విస్ట్

తాను తేజస్విని గత 13 యేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పెద్దలను సంప్రదించగా, తేజస్వి తల్లిదండ్రులు సమ్మతించలేదని ఆమె ప్రియుడు నాగేంద్ర వెల్లడించారు. అయితే, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలిసి తాము రహస్యంగా పెళ్లి చేసుకున్నామని, ఈ విషయం తెలుసుకున్న తేజస్వి తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లి ఇంట్లో బంధించారని చెప్పారు.

ఈ విషయం తెలుసుకుని తాను తేజస్విని బంధించిన ఇంటికెళ్లానని, తనను చూడగానే బోరున విలపించిన తేజస్విని... చనిపోదామని ప్రతిపాదన చేసిందన్నారు. అందుకే చనిపోయేందుకు ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నామని నాగేంద్ర చెపుతున్నాడు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో సంచలనం రేపిన తేజస్విని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తేజస్విని గొంతు తాను కోయలేదని స్వామి అలియాస్ నాగేంద్ర తెలిపాడు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని చెప్పాడు. ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, గురువారం వరకు ప్రేమోన్మాది దాడి అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో నాగేంద్రకు, తేజస్వినికి గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందనే విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, లాక్డౌన్ సమయంలో పెళ్లి కూడా చేసుకున్నట్లు నాగేంద్ర తెలిపాడు. 
 
క్రీస్తు రాజపురంలో ఉంటున్న తేజస్వినితో 13 ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసునని, ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో తేజస్విని కుటుంబ సభ్యులు తమ పెళ్లికి అంగీకరించలేదన్నాడు. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు. 
 
పెళ్లి విషయం తేజస్విని తల్లిదండ్రులకు కూడా తెలుసునని, దీనిపై గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతుందని నాగేంద్ర తెలిపాడు. దీంతో తేజస్వినీని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్బంధించి బయటకు రాకుండా చేశారన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకుని గురువారం ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నామని నాగేంద్ర తెలిపాడు. ఆ తర్వాత తాను స్పృహ తప్పి పడిపోయానని, తర్వాత తన చేతికి ఎలా గాయం అయ్యిందో తెలియదని చెప్పాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.