1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (09:36 IST)

కరోనా కష్టకాలంలో దాతల సహకారం మరువలేనిది: గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్

కరోనా కష్ట కాలంలో విభిన్న రూపాలలో  దాతలు అందిస్తున్న సహకారం మరువలేనిదని  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ అన్నారు. రాజ్‌భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమం లో సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ నుండి సమకూరిన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు,  48,000 కోవిడ్ టెస్టింగ్ వైల్స్‌ను గవర్నర్, రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ ఛైర్మెన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి, ఎకె ఫరిడాలకు అధికారికంగా అందించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందన్న నమ్మకం కలిగిస్తే వ్యధాన్యులు ఎందరో సహకరించేందుకు ముందుకు వస్తారని సూచించారు.  ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ  ప్రధాన కార్యదర్శి ఎకె ఫరిడా మాట్లాడుతూ సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రంలో కరోనా రోగులకు సహాయం అందించడానికి రూ .4.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిందని గవర్నర్ కు వివరించారు.
 
రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి  మాట్లాడుతూ విభిన్న సంస్థల నుండి  సహాయం అందుతుందని ఈ క్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ నుండి 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి 85 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 1400 పల్స్ ఆక్సి మీటర్లు, 20,000 మెడిసిన్ కిట్లు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుండి, 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుండి 5,000 మెడిసిన్ కిట్లు సమకూరాయన్నారు.

మరోవైపు ఒంటరిగా ఉన్న కరోనా రోగులకు సలహా ఇవ్వడానికి రెడ్‌క్రాస్‌కు ఉచిత హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి గవర్నర్ కు వివరించారు. సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు రాష్ట్ర ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించిన వివిధ ఎన్నారై అసోసియేషన్లు, కరోనా రోగులకు సహాయం అందించిన వాలంటీర్లకు గవర్నర్ శ్రీ హరిచందన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు, సంస్థలతో చేతులు కలపడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా రెడ్‌క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ సభ్యులు కృషి చేస్తారన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.