1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2022 (23:43 IST)

పాలిటెక్నిక్ విద్యతో అనతి కాలంలోనే ఉపాధి: సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి

Rani
ఏజెన్సీలో వివిధ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన వెంటనే పాలిటెక్నిక్ లో ప్రవేశం పొందేలా వారికి అవగాహన కల్పించాలని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశపు హాలులో  అన్ని మండలాలకు సంబంధించిన మండల విద్యాశాఖ అధికారులు, గిరిజన సంఘ శాఖ అధికారులు. ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్టిలతో సాంకేతిక విద్య అభివృద్ధిలో భాగంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరేతో కలిసి నాగరాణి సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ప్రతి ఐటీడీఏ పరిధిలో 2014 సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని, యువతి యువకులు సాంకేతిక విద్య కోర్సులు  అభ్యసించాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో నూతన కోర్సులు ఏర్పాటు చేయనుండగా, రాష్ట్రంలో 9 గవర్నమెంట్ మోడల్ సాంకేతిక రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు మంచి బోధనను అందిస్తున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ భోజన వసతి సౌకర్యం ఉండగా, పాలిటెక్నిక్ పాసైన విద్యార్థులకు ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగరాణి తెలిపారు.
 
రంపచోడవరంలో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు కృషి చేయడంతో పాటు, గిరిజన విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టే విధంగా పునాది. భవిత కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ సాంకేతిక విద్యపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆదేశించారు, ఏజెన్సీలోని చదువుకున్న యువతి యువకులకు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించే విధంగా మూడుసార్లు జాబు మేళ ఏర్పాటు చేసి సుమారు 300 మంది యువతీ యువకులు ఉపాధి అవకాశాలను నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్య డిప్యూటీ డైరెక్టర్  డాక్టర్ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సి హె. శ్రీనివాసరావు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు హాసిని. రామతులసి. మండల విద్యాశాఖ అధికారులు మల్లేశ్వరరావు. తాత అబ్బాయి దొర తదితరులు పాల్గొన్నారు.