1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (09:44 IST)

ఈవీఎం హ్యాకింగ్... నిరూపించేందుకు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించాలి : పురంధేశ్వరి

purandheswari
ఎన్నికల సమయంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లు హ్యాకింగ్ చేయొచ్చంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, మన దేశంలోని పలువురు అగ్ర రాజకీయ నేతలు ఎలాన్ మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వారిలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. ఈవీఎం‌ను ఎలా హ్యాకింగ్ చేస్తారో నిరూపించేందుకు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె సూచించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటున్న మస్క్‌ను భారత ఎన్నికల సంఘం ఆహ్వానించాలని కోరుతున్నాం. ఈవీఎంలను ఎలాహ్యాక్ చేయవచ్చో నిరూపించేందుకు ఆయనకు ఓ అవకాసం ఇవ్వాలంటూ ఆమె సెటైర్లు వేశారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఎన్నికల సంఘం చాలా మంది అవకాశం ఇచ్చిందని, కానీ ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని పురంధేశ్వరి గుర్తు చేశారు. 
 
కాగా, ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని ప్రపంచ దేశాలు బహిష్కరించాలని, కొంతమేర ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాం ఉందని, మనుషులు కానీ, ఏఐ టూల్స్‌తో కానీ ఈవీఎంలను హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని ఎలాన్ మస్క్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌లో పెను దుమారమే రేపాయి. మస్క్ వ్యాఖ్యలు ఇండియా కూటమి నేతలకు ఓ ఆయుధంలా మారాయి. భారత్‌లో ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌ల వంటివని వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.