బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2024 (15:41 IST)

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ

Chandra babu
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి సీమెన్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంది. అలాగే ఏపీ ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు నాయుడుకి కూడా ఈడీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ కేసుతో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తులో సీఎం ప్రమేయం వుందనే విషయం తేలలేదని, ఆయనకు లేదా గత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి, అక్రమాలకు ముడిపెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సీమెన్స్‌ సంస్థలు ప్రాజెక్టు నిధులను దారి మళ్లించాయని ఆంధ్రప్రదేశ్‌ నేర పరిశోధన విభాగం (ఏపీ సీఐడీ) గతంలో కేసు నమోదు చేసింది.
 
ఏపీలో సంచలన సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తాజా ఆస్తుల అటాచ్ మెంట్‌లో సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసిందని టాక్. వినాయ ఖాన్వేల్కర్, సుమన్ బోస్ సహా పలువురు బోగస్ ఇన్ వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారని టాక్. 
 
ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ, ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల వివరాల్లో ఎక్కడా చూపించలేదని అంటున్నారు. దీంతో... ఈ కేసులో బాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లే అయ్యిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. దీంతో.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 52 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు.