గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:33 IST)

ఏపీలో ఈఎస్ఐ స్కామ్.. బీసీ నేతలే టార్గెట్ : కొల్లు రవీంద్రం

ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని ఇరికించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టెలీ హెల్త్ సర్వీసెస్ పరిమితి రూ.10 కోట్ల వరకువుంటే.. రూ.100 కోట్ల కుంభకోణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే అచ్చెన్నాయుడిని ఇరికిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు.
 
బీసీ నేతలే టార్గెట్.. 
బీసీ నేతలను వైసీపీ సర్కార్ టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే లేనిపోని ఆరోపణలు అచ్చెన్నాయుడుపై చేస్తున్నారని ఫైరయ్యారు. ఏదో ఒక స్కాంలో ఇరికించాలని అచ్చెన్నాయుడు పేరు తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహాం వ్యక్తంచేశారు. జగన్ సర్కార్ చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే.. చివరికి అచ్చెన్నాయుడపై అభియోగాలు మోపడం దారుణమన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
 
కేసులను మళ్లించేందుకే.. 
వైసీపీ నేతలపై ఉన్న కేసులను దారి మళ్లించేందుకే కొత్త కేసులను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. మందులు కొనుగోలు చేశారని అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇది ఒక్క అచ్చెన్నాయుడిపై జరుగుతున్న దాడి కాదని.. రాష్ట్రంలో ఉన్న బీసీలపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.