శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (18:46 IST)

మాస్క్ ధరించకుంటే గ్రామాల్లోనూ జరిమానా: మంత్రి పెద్దిరెడ్డి

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, వేతనదారుల౦దరితో మాస్క్ ధరింపజేసే బాధ్యత ఉపాధి హామీ, గ్రామపంచాయతీ సిబ్బంది తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహి౦చిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో గ్రామీణులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెప్తూ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ/ సచివాలయ సిబ్బంది అందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 గ్రామ వాలె౦టీర్లు, మేట్లు/ సీనియర్ మేట్లు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్  ధరిస్తున్నారో లేదో గమనించాలని, ధరించని వారికి అవగాహన కల్పించాలని, మాస్క్ ధరించని వారికి గ్రామ పంచాయతీ స్థాయిని బట్టి రూ. 10- రూ.50/- వరకు జరిమానా విధించే నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని, జరిమానా ఆదాయాన్ని తిరిగి పారిశుద్ధ్యానికి వినియోగించాలని చెప్పారు.

గ్రామాల్లో వారం రోజుల పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతపై మైక్ ద్వారా వాడవాడలా   ప్రచారం చేయాలని, గ్రామంలో ఉండే గుడి/మసీదు/చర్చిల్లోని మైక్ సెట్ల ద్వారా కూడా కరోనా వ్యాధి వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ, అవగాహనా సందేశాలను మెసేజ్ రూపంలో పంపుతామని వాటిని గ్రామాల్లో ప్రచారం చేయాలని అంటూ, 2000 జనాభా మించిన గ్రామపంచాయతీలలో కనీసం ఐదు ప్రదేశాల్లో ఫ్లెక్సి బ్యానర్లు ఉంచాలని, వాల్ రైటింగ్స్ రాయించాలని, సోషల్ ఆడిట్ డిఆర్ పిలు, సిఆర్ పిలను కోవిడ్ అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకోవాలని అన్నారు.

వేతనదారులు మాస్క్ ధరించడంతో పాటు, చుట్టూ  ఉన్న వాళ్ళతో కూడా మాస్క్ ధరించేలా చూసే బాధ్యత తీసుకునేలా వారికి సిబ్బంది అవగాహన కల్పించాలని, పని ప్రదేశంలో మాస్కులు ధరించి వేతన దారులు పనిచేస్తున్న ఫోటోలను అప్ లోడ్ చేయాలని, శుక్రవారం జరిగే రోజ్ గార్ మీటింగులో ఈ విషయాన్ని చెప్పాలని కమిషనర్ కోరారు.

అలాగే  పిడి డ్వామాలందరూ తగిన చర్యలు తీసుకుని, వేతనదారులందరికి మాస్క్ ధారణపై అవగాహన కల్పించి, వేతనదారులు ఇంటి నుంచి పనికి వచ్చే సమయంలో, పని ప్రదేశంలో, పని ముగిసిన తరువాత, తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో మాస్కులు ధరించేలా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని   కమిషనర్ పి.గిరిజా శంకర్ ఆదేశించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఇజిఎస్ సంచాలకులు పి.చిన తాతయ్య,  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పాల్గొన్నారు.