1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (16:12 IST)

కరోనా వైరస్ సోకి ఒకే కుటుంబంలో నలుగురి మృతి -మాస్క్ లేకుంటే రూ.100 ఫైన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. గతంలో వయస్సు పైబడినవారినే టార్గెట్ చేసిన కరోనా.. ఈసారి వయసుకు సంబంధం లేకుండా ఆ వైరస్‌కు ఇష్టం వచ్చిన రీతిలో కోరలు చాపుతోంది. ఫలితంగా అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. 
 
ఇప్పటికే పలు కుటుంబాల్లో పలువురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరోనా... తాజాగా విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకుంది. నాలుగురోజుల క్రితం కరోనా వైరస్‌తో పాతబస్తీకి చెందిన లాయర్‌ దినేష్(37) మృతి చెందాడు. 
 
మంగళవారం తెల్లవారుజామున దినేష్ తండ్రి మృతి చెందాడు. 3 రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు. మొత్తానికి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
మరోవైపు, 'కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ కచ్చితంగా ధరించాలి. లేనివారికి రూ.100 జరిమానా విధించాలి. 1 నుంచి 9 తరగతుల వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు మూసివేస్తున్నాం' అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. 
 
కొవిడ్‌ వ్యాప్తిపై ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పది, ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 
 
104 కాల్‌ సెంటర్‌ను మరింత పటిష్ఠం చేయాలన్నారు. కన్వెన్షన్‌ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించేలా చూడాలన్నారు.
 
సినిమా హాళ్లలో ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీగా వదలాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. 
 
కాగా రోజుకు 310 టన్నుల ఆక్సిజన్‌ సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,446 ఆక్సిజన్‌ బెడ్లకు 347 కిలో లీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుందని తెలిపారు.