శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (16:24 IST)

గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ‘అహింసా దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు: గవర్నర్ బిశ్వ భూషణ్

దేశం కోసం గాంధీ మహాత్ముడు చేసిన అత్యున్నత త్యాగం, బోధనలు భారతీయులుగా మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ సందేశం విడుదల చేశారు. మహాత్ముని ఆలోచనలు ప్రపంచ నాయకులకు సైతం  స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కొనియాడారు.
 
మహాత్మా గాంధీ ‘సత్యం’, ‘అహింస’ మార్గాన్ని తన జీవన విధానంగా ఎంచుకుని అనితర సాధ్యమైన విజయాలను సాధించారన్నారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ‘అహింసా దినోత్సవం’ గా జరుపుకుంటున్నారని, మానవాళికి ఆయన చూపిన ఆలోచన రేకెత్తించే మార్గం ఎంత సందర్భోచితంగా ఉందో ఇది చెబుతోందని వివరించారు.
 
జాతిపిత అడుగుజాడలను అనుసరించడం ద్వారా సత్యం, అహింస సూత్రాలకు మనం పునరంకితం అవుతూ ప్రతిజ్ఞ చేద్దామన్నారు. మహాత్మా గాంధీజీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం రాజ్ భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ జాతిపితకు నివాళులు అర్పించనున్నారు.
 
 
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌కు గవర్నర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ జన్మదినం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ, దేశాధ్యక్షుని పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి తాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.
 
కరోనా మహమ్మారి  ఇక్కట్ల నేపధ్యంలో దేశానికి, ప్రజలకు రాష్ట్రపతి అందించిన సలహాలు మార్గదర్శకత్వం ఎంతో మేలు చేశాయన్నారు. కరోనా సవాలును ఎదుర్కోవటానికి  అవసరమైన ఆశ, విశ్వాసం, బలాన్ని రాష్ట్రపతి అందించ గలిగారని గవర్నర్ అన్నారు. ఫలవంతమైన జీవితం, మంచి ఆరోగ్యం, ఆనందాలతో భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ముందుకు సాగాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఈ మేరకు పూరీ జగన్నాథ్, తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నానన్నారు. రాజ్ భవన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.