గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (18:08 IST)

కరోనా మహమ్మారికి 20 లక్షల మంది చనిపోతారట... డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై అంతర్జాతీయ సమాజం మేల్కొనకపోతే ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. గడచిన 9 నెలల్లో దాదాపుగా 10 లక్షల మంది వరకు చనిపోయారనీ, ఈ సంఖ్య మున్ముందు 20 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొంది. 
 
కరోనా సూక్ష్మిక్రిమి మహమ్మారిపై డబ్ల్యూహెచ్ఓ ఓ హెచ్చరిక చేస్తూ, కొవిడ్-19 కట్టడికి తక్షణం ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపట్టకుంటే, దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే కరోనాపై అన్ని దేశాలూ యుద్ధం ప్రకటించాలని సూచించింది. 
 
ఈ వ్యాధి తొలిసారిగా చైనాలోని వూహాన్‌ నగరంలో వెలుగు చూడగా, ఆపై 9 నెలల వ్యవధిలోనే 10 లక్షల మంది వరకూ కన్నుమూశారు. ఈ పరిస్థితి చాలా ఆందోళనకరమని, కేవలం ప్రభుత్వాలు మాత్రమే చర్యలు చేపడితే సరిపోదని, ప్రజలు సైతం తమతమ స్థాయిలో వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. 
 
ఈ వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సూచనలు ఇంతవరకూ కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అందుబాటులోకి తెచ్చామని వెల్లడిస్తూ, సైనికులకు, వైరస్‌పై యుద్ధం చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్యకర్తలు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న చైనా, ప్రపంచ శాస్త్రవేత్తల నుంచి వస్తున్న విమర్శలను సైతం పక్కనబెట్టి, వారికి రెండో డోస్‌ను ఇస్తోంది 
 
ఇదిలావుండగా, యూఎస్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ, తమ వ్యాక్సిన్ ఒక్క డోసుతోనే కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో తయారవుతున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను 60 వేల మందిపై పరీక్షిస్తున్నారు.