1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (10:00 IST)

లాక్‌డౌన్ తర్వాత ప్రజా రవాణా అనుమానామే : జీవోఎం

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది మే నెల మూడో తేదీ వరకు ఉండనుంది. అప్పటివరకు ప్రజా రవాణా నిలిచిపోనుంది. ఆ తర్వాత కూడా ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకుని రావడం కష్టమవుతుందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 
 
శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, ప్రయాణాలను మే 15వ తేదీ తర్వాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, హర్దీప్ సింగ్ పూరిలతోపాటు ఉన్నతాధికారులు కొందరు హాజరయ్యారు.
 
'విమానాల సర్వీసులపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇదేసమయంలో విమానాలను పార్కింగ్ చేసి ఉండటం ఆయా సంస్థల ఖర్చును పెంచుతోంది. మే 4 నుంచి కూడా ప్రయాణాలపై ఆంక్షలు ఉండవచ్చు. 15 తర్వాత పరిస్థితిపై తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి' అని ఇదే సమావేశానికి హాజరైన ఓ కేంద్ర సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. 
 
'దేశంలో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఓ తేదీని నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే ఇందుకు కొంత సమయం పడుతుంది. ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్‌డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు' అని మరో అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే.