ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 16 జులై 2021 (13:22 IST)

రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీత వై.డి.రామారావుకు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ త‌న కార్యాల‌యంలో రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీత వై.డి.రామారావుకు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా అయిన గ‌వ‌ర్న‌ర్ తూర్పుగోదావ‌రి రెడ్ క్రాస్ ఛైర్మ‌న్ రామారావు సేవ‌ల్ని కొనియాడారు.

ద‌శాబ్ద కాలంగా వై.డి.రామారావు రెడ్ క్రాస్ త‌ర‌ఫున సేవ‌లందిస్తున్నారు. ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తి ఏడాది జాతీయ స్థాయిలో రెండు బంగారు ప‌త‌కాల‌ను అందిస్తుంది. ద‌శాబ్దాలుగా రెడ్ క్రాస్ సేవ‌లందించిన వారికి ఈ ప‌త‌కాలు ఇస్తారు. ఈసారి రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్  వై.డి.రామారావుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.
 
రెడ్ క్రాస్ సొసైటీ కోవిడ్ స‌మ‌యంలోనూ సేవ‌ల్ని అందించింద‌ని, తూర్పుగోదావ‌రి జిల్లాలో ర‌క్త నిధి, కోవిడ్ బాధితుల‌కు సేవ‌లు అందించామ‌ని రామారావు వివ‌రించారు. దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌లెత్తిన‌పుడు రెడ్ క్రాస్ సేవ‌లు నిరుప‌మాన‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

మామూలు స‌మయాల్లో అయితే, భారీ స‌భ ఏర్పాటు చేసి మెడ‌ల్ బ‌హూక‌రించాల్సింద‌ని, అయితే కోవిడ్ కార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌న్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2018-19 సంవ‌త్స‌రానికి రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీతగా వై.డి.రామారావుకు ఈ పుర‌స్కారం అందించామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రెడ్ క్రాస్ ఛైర్మ‌న్ ఎ.శ్రీధ‌ర్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎ.కె. ప‌రీదా, త‌దిత‌రులు పాల్గొన్నారు.