శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (10:59 IST)

గుంటూరులో హైటెక్ వ్యభిచార ముఠా అరెస్ట్.. కీలక నిందితుడు స్టూడెంట్

గుంటూరులో హైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని కీలక నిందితుడు బీటెక్ విద్యార్థి కావడం గమనార్హం. యాప్ ఆధారంగా ఈ దందా నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పాలిటెక్నిక్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వీరబ్రహ్మం.. ఈ-సెట్‌లో 2 వేల ర్యాంకు సాధించి గుంటూరులో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం 4వ సంవత్సరం చదువుతున్నాడు. 
 
వీరబ్రహ్మం ఓసారి ఓ యాప్ ద్వారా కాల్ గాళ్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి పరిచయమై అతడి నుంచి రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్‌ పంపాడు. అక్కడికి వెళ్లాక ఎవరూ లేకపోవడంతో అనుమానంతో రవికి ఫోన్ చేశాడు. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
 
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను కూడా ఇలా మోసం చేయవచ్చని భావించాడు. తన నంబరును కూడా ఆన్‌లైన్‌లో పెట్టి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లితో వీరబ్రహ్మానికి పరిచయం అయింది. ఆమెతో ఉంటూ థామస్ కుమార్‌తో కలిసి పాత గుంటూరులోని నంది వెలుగు రోడ్డులో గది అద్దెకు తీసుకుని వ్యభిచారం దందాకు తెరలేపారు. ప్రతి రోజు యువతులు, యువకులు వచ్చి వెళ్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయింది.