1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (08:58 IST)

"ఛలో విజయవాడ" : ప్రభుత్వ ఉద్యోగులపై ఆంధ్రా పోలీస్ ఉక్కుపాదం...

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గురువారం తలపెట్టిన "ఛలో విజయవాడ" కార్యక్రాన్ని భగ్నం చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. "ఛలో విజయవాడ" వెళ్లే ఉద్యోగులను అడ్డుకునేందుకు వీలుగా రైళ్లు, బస్సుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ 'ఛలో విజయవాడ'కు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్లతో పాటు పోలీసులు కూడా గట్టి హెచ్చరికలు చేశారు. 
 
'ఛలో విజయవాడ' కార్యక్రమానికి విజయవాడ నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందువల్ల ఉద్యోగులు ఎవ్వరూ అక్కడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాదని ఎవరైనా వెళితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేసమయంలో అత్యవసర కారణాలైతే తప్ప ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గురువారం సెలవులు ఇవ్వొద్దంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ సర్కారు సర్క్యులర్ జారీచేసింది. 
 
ఇదిలావుంటే 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చేయాల్సిన అన్ని రకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఈ గృహ నిర్బంధాలు బుధవారం ఉదయం నుంచే మొదలుపెట్టి, ఛలో విజయవాడ కార్యక్రమం జరుగకుండా పూర్తి ప్రయత్నాలు చేశారు.