శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (18:51 IST)

నా భార్యతోనే చాట్ చేస్తావా? యువకుడిని నడిరోడ్డుపై పొడిచిన భర్త

అది విజయవాడలోని గుణదల సమీపంలోని గుట్ట ప్రాంతం. ఒక యువకుడు దారుణ హత్యకు గురై ఉన్నాడు. అతడిని కత్తితో అతి దారుణంగా చంపేశారు. వాకింగ్‌కు వెళుతున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 
 
యువకుడి పేరు సంతోష్ కుమార్. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా తిరుగుతున్నాడు. గుణదలలోనే నివాసముండేవాడు. సంతోష్‌ను ఎవరు హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సంతోష్ ఫోన్లో ఒక మహిళ ఫోటో.. ఆమెతో తరచూ సంతోష్ చాట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
 
దీంతో పోలీసులు ఆమెకు ఫోన్ చేశారు. మీ పేరేంటి అని ఎస్.ఐ. అడిగాడు. తానెవరో చెప్పి వివరాలు అడిగాడు. సర్.. నా పేరు చందన. మేము గుణదలలోనే ఉంటాము. నా భర్త పేరు రాజశేఖర్ అని చెప్పింది. సంతోష్ నీకు తెలుసా అని అడిగాడు. సర్.. నాతో పర్సనల్‌గా సంతోష్ చాట్ చేసేవాడు. అతడిని నేరుగా ఎప్పుడూ కలవలేదు సర్ అని చెప్పింది చందన. అసలేమైంది అని అడిగింది.
 
చందనకు జరిగిన విషయాన్ని చెప్పాడు ఎస్.ఐ. సంతోష్‌ను చంపేశారా, అయ్యో అంటూ చందన బాధపడింది. విచారణ కోసం ఏ అవసరమున్నా సరే పిలుస్తామని చెప్పారు. సరే అని ఫోన్ పెట్టేసింది చందన. ఆ తరువాత మరో నెంబర్ చూశారు. ఆ నెంబర్ రాజశేఖర్ అని తెలిసింది. చందన భర్త నెంబర్ సంతోష్ ఫోన్లో ఎందుకు ఉందని ఆలోచించాడు ఎస్.ఐ.
 
రాజశేఖర్‌ను పిలిచి తనదైన స్టైల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్మార్ట్ ఫోన్ కొనివ్వమని చెప్పిందని.. ఫోన్ కొనిస్తే ఎవరెవరితోనే చాట్ చేస్తూ ఉండేదని, తనను పట్టించుకోవడం మానేసిందని, అందులోను సంతోష్ అనే యువకుడితో ఎక్కువగా చాట్ చేసినట్లు చూశానని చెప్పాడు. 
 
అయితే సంతోష్‌ను తాను బెదిరించానని, ఎంతకూ అతను భయపడకపోవడంతో గుణదల గుట్టపైకి రమ్మని చెప్పి కత్తితో పొడిచానని చెప్పాడు రాజశేఖర్. విషయం తెలుసుకున్న చందన ఆశ్చర్యపోయింది. తాను ఇంతవరకు సంతోష్‌ను చూడలేదని, కేవలం స్నేహితుడిలాగే చాట్ చేసేదాననని చెప్పింది. ఆవేశపడి హత్య చేశానని అనుకున్న రాజశేఖర్ తనలో తానే కుమిలిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.