శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (14:42 IST)

దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది.. : విత్తమంత్రి భర్త పరకాల ప్రభాకర్

కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ భర్త, ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ దేశ ఆర్థిక రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం వాస్తవాలను అంగీకరించకపోగా వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. పైపెచ్చు, మాజీ ప్రధానులు వీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్‌ల ఆర్థిక విధానాలే బాగున్నాయని తెలిపారు. 
 
మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ఎన్ని 'ఉద్దీపన' చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందన్నారు. కానీ, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదన్నారు. గతంలో దేశ ప్రధానులుగా చేసిన పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్‌ల హయాంలోనే దేశ ఆర్థిక విధానాలు బాగున్నాయని కొనియాడారు. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. 
 
గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చినా ఇది 0.8 శాతం తక్కువ. పైగా, వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.