శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (15:15 IST)

హస్తినకు దిశ కేసు నిందితుల మృతదేహాలు .. ఎందుకో తెలుసా?

గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పశు వైద్యురాలు డాక్టర్ దిశ హత్యాచార ఘటనకు కారణమైనటువంటి నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. అయితే అదే రోజు రాత్రి ఆ నలుగురి మృతదేహాలను ఖననం చేయాలని భావించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు. కాగా హై కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి భద్రపరిచారు. 
 
అయితే ఆ తర్వాత వాటిని హైదరాబాద్‌లోని గాంధీ మార్చురీకి తరలించారు. నిజానికి ఆ మృతదేహాలను ఈనెల 13వ తేదీ వరకే భద్రపరచాలి అని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. దీంతో వాటిని భద్రపరచడానికి మరికొంత సమయం కావాలని ఆదేశాలు వచ్చాయి. ఫలితంగా గాంధీ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్‌లో భద్రపరచినప్పటికీ కూడా ఎంతో కొంత సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
 
చివరికి అవి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక వాటిని భద్రపరచడం తమ వల్ల కాదని గాంధీ సిబ్బంది చేతులెత్తేశారు. అయితే ఒకవేళ అవి కుళ్ళిపోతే వాటికి రీపోస్టుమార్టం జరపడానికి అవకాశం ఉండదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ మృతదేహాలను ఢిల్లీకి తరలించడానికి అనుమతిని ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.