శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (18:56 IST)

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు.. మంత్రి మోపిదేవి

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న పలు సంక్షేమ కార్యక్రమాల విషయంలోగానీ, రైతులను ఆదుకునే విషయంలో గానీ విప్లవాత్మకవమైన మర్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకేస్తున్నార‌ని మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు.

రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఎజెండాతో ముందుకెళుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర విషయంలో మూడు వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటుచేయడంతో పాటు, రైతు నష్టపోకూడదని అనేక చర్యలను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే శనగ రైతులకు ఉపయోగపడేవిధంగా ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 5 ఎకరాల రైతుకు 45 వేల రూపాయల నష్టపరిహరం లభించేలా చర్యలు తీసుకున్నాం.

63 వేల మంది శనగరైతులను గుర్తించి ఇప్పటివరకూ 75 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాం, మిగిలిన నష్టపరిహరం కూడా ఈ నెలాఖరికల్లా చెల్లించడానికి అధికార యంత్రాగం సిద్దమవుతుంది. 7 జిల్లాల్లో 333 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్దంగా ఉన్నాం. శనగ రైతులు వేర్వేరు పంటల పేరుతో ఈక్రాప్‌ బుక్‌ చేసుకున్నారు.

వందలాది మంది రైతులు ఈ సమస్య సీఎం గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈక్రాప్‌ నిబంధనలతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు శనగరైతులను ఆదుకోవడానికి మేం మరింతగా నిబంధనలు సడలించాం. 

ఉల్లిధరల విషయంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వమే నేరుగా మహరాష్ట్ర నుంచి నాఫెడ్‌ ద్వారా కొనుగోలుచేసింది. కర్నూలు మార్కెట్‌ నుంచి కూడా కొనుగోలు చేసి సుమారు 700 క్వింటాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 85 రైతుబజార్లలో కిలో రూ.25 చొప్పున అమ్మాం. అధిక ధరకు కొని తక్కువ ధరకు వినియోగదారుడికి కొనుగోలు చేసిన పరిస్ధితి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదు. దాని వల్ల 2 కోట్ల భారం ఖజానాపై పడింది.

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో దళారీలు వ్యవహరించిన తీరు సీఎం గారి దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నేరుగా రంగంలోకి దిగి ఎక్కువ ధరకు కిలో రూ. 20 నుంచి రూ.25 చొప్పున కొని వినియోగదారులకు మాత్రం కిలో రూ. 11 చొప్పున అమ్మాం. దళారీ వ్యవస్ధ వల్ల రైతు నష్టపోకూడదని చర్యలు తీసుకున్నాం. రూ.100 కోట్లు కేటాయించి పెసలు, శనగలు, నుములు వంటి వాటికి కనీస మద్దతు ధరకు రైతుల వద్ద కొనుగోలు చేశాం. 
 
సుబాబుల్‌ రైతులు...
సుబాబుల్‌ రైతుల కోసం దాదాపు రూ. 6 కోట్ల ధరల స్ధిరీకరణ నిధి నుంచి ఇచ్చాం. గడిచిన ఏ ప్రభుత్వం ఎన్నడూ రైతుల కోసం ఇలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. గాడితప్పిన ఆర్ధిక రంగాన్ని గాడిలో పెడుతూ పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఇది. 

 
టీడీపీ ప్రభుత్వంలో ధరల స్ధిరీకరణ నిధికి రూ.5 వేల కోట్లు కేటాయించాం అన్నారు కానీ ఆ నిధి నుంచి రూ. 5 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు.  చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్షలు పెడుతూ మాట్లాడుతున్న మాటలు చూస్తే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకున్నాం అని ప్రజలు అనుకుంటున్నారు.

151 మంది ఎమ్మెల్యేలను మేకలతో పోలుస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పులులు అంటున్నారు. అందుకే ఆ పులులను జనారణ్యంలో ఉండకూడదని అడవులకు తరిమేశారు. శాసనసభ్యులను ఈ విధంగా కించపరచడం ఎంతవరకు సమంజసం. మీ తనయుడు లోకేష్‌ మతిలేనివాడిగా గుర్తింపు పొందారు కాబట్టే మంగళగిరి ప్రజలు కూడా ఆయన్ను తిరస్కరించారు.

అస్తవ్యస్త పాలనగా సాగిన మీ పాలనను గాడిలో పెడుతూ సీఎం జగన్‌ ముందుకెళుతుంటే మీరు మాట్లాడే మాటలా ఇవి. అనుభవమున్న రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడతారా. స్ధాయి దిగజారి మాట్లాడుతున్నారు. తన ఉనికిని మనుగడను కాపాడుకునేందుకు చంద్రబాబు ఇలా దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలు ఇప్పటికే బుద్దిచెప్పారు. అయినా ఆయన మారలేదు.