గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 26 నవంబరు 2021 (11:28 IST)

నీ కొడుకు వయసున్న సీఎం జ‌గ‌న్ పై శాపనార్థాలా బాబూ!

ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంతో హుందాగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి సహకరించాలే గాని, నారా చంద్ర‌బాబులా మాత్రం వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. తన కొడుకు వయసు గల రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ పై వ్యక్తిగతంగా దూషణలు చేయడం శాపనార్థాలు పెట్టడం తగదన్నారు. 
 
 
మంత్రి పేర్ని నాని శుక్రవారం ఉదయం అమరావతి సచివాలయంలో 2వ బ్లాక్ వద్ద మీడియా పాయింట్ లో పాత్రికేయులతో మాట్లాడారు. ప్రతిపక్ష టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ప్రవర్తిస్తున్న తీరును ఆయ‌న తప్పు పట్టారు.  రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే, వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే, అలాగే గాల్లో కలిసిపోతాడు అని శాపనార్థాలు పెట్టడం ఎంతవరకు సబబు అన్నారు.
 
 
గతంలో ఆయన సీఎంగా పని చేసినప్పుడు వరద ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించ లేదా అని ప్రశ్నించారు? ఏ ముఖ్యమంత్రి అయినా చేసేపని అదేననీ, అటువంటప్పుడు తప్పుబట్టడం ఎందుకన్నారు. త‌మ‌ ప్రభుత్వంపై శిరస్సు నుండి పాదాల వరకూ అసూయ ద్వేషాలతో ఆయన రగిలి పోతుండడం వల్లనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కావాలంటూ అడిగిన చందాన, ఈయన ఎక్కడికి వెళ్ళినా, నా భార్యను నిందించారు అంటూ, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటమే అజండా అయిపోయింద‌న్నారు.
 
 
ఆయన భార్యను మేమేదో  నిందించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన ఖండించారు. మా ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని, తల్లి ,చెల్లి, పిల్లలు ఉన్నారని, మాకు మానవత్వం ఉంటుందని, మేము ఇతరుల ఆడవాళ్ళను విమర్శించే, నిందించే దుస్థితిలో లేమని అన్నారు. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, గతంలో ఈయన సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో పబ్లిసిటీ పిచ్చితో 31మంది మరణానికి కారణమయ్యారని, దానిని మానవతప్పిదం అంటారు గాని, రాయలసీమ ప్రాంతంలో వరదలు రావడం మానవ తప్పిదం కాదని అన్నారు.
 
ఇక ఆన్లైన్ సినిమా టికెట్ల విషయంలో జీఓ 35 లో నిర్దేశించిన సినిమా టికెట్ల ధరలను పునఃసమీక్షించాలని పలువురు నటులు, ప్రొడ్యూసర్లు కోరిన విషయం వాస్తవమేనని, త్వ‌రలోనే ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.