1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జులై 2023 (16:40 IST)

జాబిల్లిపై ప్రయోగానికి సర్వం సిద్ధం.. చెంగాళమ్మ ఆలయంలో పూజలు

somnath
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనుంది. చందమామపై ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని దారుల్లో ఈ ప్రయోగం నిర్వహించేందుకు సిద్ధమైంది. దక్షిణ ధృవానికి చేరువకావడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ప్రపంచ మానవాళికి ఎంతో మేలు జరగనుంది. 
 
ఇందుకోసం చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనుంది. ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత చంద్రయాన్-3 వ్యోమనౌకను భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యం వరకు తీసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యులర్ ఉంటుంది. చంద్రుడిపై దిగి పరిశోధనలు సాగించేందుకు వీలుగా విక్రమ్ ల్యాండర్ ఉంది. జాబిల్లి ఉపరితలంపై కలియతిరుగుతూ పరిశీలనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ కూడా ఉంది. 
 
ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో రూ.613 కోట్లను ఖర్చు చేసింది. ఈ రాకెట్ బరువు మొత్తం 3900 కిలోలుగా ఉంటుంది. ఈ ప్రయోగాన్ని జూలై 16వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగిస్తారు. అన్నీ అనుకూలిస్తే ఇది చంద్రుడిపై ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో దిగుతుంది. కాగా, ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండర్లను దించిన దేశాల జాబితాను పరిశీలిస్తే, అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలు ఉన్నాయి. 
 
మరోవైపు, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ కీలక ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి వేదికగా నిలుస్తుంది. ఇందుకోసం ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రయాన్ -3  విజయవంతం కావాలంటూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముంది ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రోవర్ చంద్రుడిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగుతుందని భావిస్తున్నామని తెలిపారు.