శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (15:51 IST)

తితిదేలో టీటీపీ అక్రమాలపై కాగ్‌తో ఆడిట్ చేయించాలి : డాక్టర్ స్వామి

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఆడిట్ చేయించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో టీటీడీలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. 
 
గత ఐదేళ్లకు సంబంధించిన టీటీడీ అకౌంట్లను కాగ్ తో ఆడిట్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అవుతుందని చెప్పారు. టీటీడీపై ప్రభుత్వానికి అజమాయిషీ లేకుండా చేస్తానని అన్నారు.
 
గతంలో తమిళనాడులోని నటరాజస్వామి ఆలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆధిపత్యం లేకుండా తాను చేశానని స్వామి చెప్పారు. ఆలయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తనకు, తమిళనాడు రాష్ట్రానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని గుర్తుచేశారు. 
 
అదేవిధంగా తితిదేపై కూడా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా చేసేలా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. కాగా, మసీదులు, చర్చిలపై ప్రభుత్వాల అజమాయిషీ లేదని... ఇదే సమయంలో ప్రభుత్వాల అధీనంలో 4 లక్షల ఆలయాలు ఉన్నాయని చెప్పారు.
 
మరోవైపు, తిరుమల ఆలయంపై గత కొంత కాలంగా అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందంటూ ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని... ఆ సంస్థపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల ఆలయంపై దుష్ప్రచారం ఎక్కువైందని అన్నారు.