ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (16:18 IST)

89 యేళ్ల శ్రీధరన్ సీఎం అభ్యర్థా? అద్వానీ - జోషిలు ఎన్నికల్లో పోటీ చేయాలి : డాక్టర్ స్వామి

భారతీయ జనతా పార్టీ పెద్దలు తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. 89 యేళ్ళ కె.శ్రీధరన్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వయోవృద్ధుడైన మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ప్రకటించడాన్ని స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ 89 ఏళ్ల శ్రీధరన్‌ను కేరళ సీఎం రేసులో నిలిపడాన్ని ఆయన ఆక్షేపించారు. 
 
అలా అయితే, 75 ఏళ్లకు పైబడిన వృద్ధ నేతలను మార్గదర్శన మండలి పేరుతో వనవాసానికి పంపే బీజేపీ ఇప్పుడు మెట్రోమ్యాన్‌ను సీఎం అభ్యర్థిగా తీసుకువస్తోందని తెలిపారు. అందుకే, అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్ వంటి కురువృద్ధులు 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. 
 
బీజేపీ అధినాయకత్వం 75 ఏళ్లకు పైబడిన వృద్ధులను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 93 ఏళ్లు కాగా, జోషి వయసు 87 సంవత్సరాలు. వారిద్దరి అనుభవం దృష్ట్యా పార్టీకి సలహాలు ఇచ్చే మార్గదర్శన మండలిగా వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.