శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (16:26 IST)

మేం కన్నెర్రజేస్తే పాదయాత్రలు ఆగిపోతాయ్.. తస్మాత్ జాగ్రత్త : మంత్రి బొత్స వార్నింగ్

bosta
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు చేపట్టిన పాదయాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను బెదిరించే విధంగా మాట్లాడారు. అంతా మా యిష్టం అన్న చందంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మేం కన్నెర్రజేస్తే పాదయాత్రలన్నీ ఆగిపోతాయ్ అంటూ గర్జించారు. పైగా, పాదయాత్రను అడ్డుకోవడం క్షణాల్లో పనికాదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన విశాఖలో ఆదివారం మాట్లాడుతూ, మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేశారు. అసలు విశాఖ రాజధాని చేయడం వల్ల వీరికి వచ్చిన నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. 
 
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్రలు ఆగిపోతాయన్నారు. అయితే, యాత్రలను అడ్డుకోవడం పద్ధతి కాదని చెప్పారు. 
 
మూడు రాజధానులు తమ విధానమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు. ఒక ప్రాంతం గురించో, కొందరు వ్యక్తుల గురించో ఆలోచించకూడదని చెప్పారు. మూడు రాజధానులకు అనుగుణంగా అన్ని సంఘాలు ర్యాలీలు చేయాలని అన్నారు. 
 
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరావతి రైతుల పాదయాత్రను తరిమికొట్టాలని కొందరు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయవద్దని అన్నారు.