1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (08:38 IST)

నారా లోకేశ్ మహా పాదయాత్ర.. విశ్రాంతి లేకుండా 450 రోజుల పాటు

nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని అధికార పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల వ్యాహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి తర్వాత విశ్రాంతి లేకుండా 450 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగేలా రూపకల్పన చేస్తున్నారు. 
 
ఈ యాత్ర చిత్తూరులో ప్రారంభమై, ఉత్తరాంధ్రలో ముగియనుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో యాత్ర చేపట్టనున్న నేతగా నారా లోకేశ్ గుర్తింపు పొందనున్నారు. 2023  సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే ఈ యాత్రం 2024 మార్చి నెలలో ముగియనుంది. అప్పటివరకు విశ్రాంతి లేకుండా ఈ యాత్ర నిరంతరాయంగా సాగనుంది. 
 
ఈ పాదయాత్రలో అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్ మ్యాచ్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, విరామం లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేశ్, యోచిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టి విజయం సాదించారు. ఇపుడు ఆయన తనయుడు నారా లోకేష్ ఇదే తరహాలో పాదయాత్ర చేపట్టి పార్టీని 2024లో అధికారంలోకి తీసుకునిరావాలని భావిస్తున్నారు. 
 
నిజానికి ఉమ్మడి ఏపీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు. అదేసమయంలో ఏపీ రెండుగా విడిపోయింది. దీంతో ఆయన పాదయాత్ర కేవలం ఏపీకి పరిమితమై వైకాపా అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. ఇపుడు విభజిత ఏపీలో పాదయాత్ర చేస్తున్న తొలి నేతగా లోకేశ్ గుర్తింపు పొందనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన తన యాత్రను కొనసాగించనున్నారు.