శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:49 IST)

అమరావతి రైతులు మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారు

farmers amaravati
రాజధాని కోసం అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి మహా పాదయాత్రకు ప్లాన్ చేశారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి వరకు ఈ పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ పాదయాత్ర ప్రారంభ ముహూర్తాన్ని రైతులు ఫిక్స్ చేశారు. 
 
అయితే, ఈ పాదయాత్రకు ఏపీ పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు. దీంతో అమరావతి రైతుల పరిక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ పాదయాత్రను 12వ తేదీన వేకువజామున 5 గంటలకు మూహుర్తం ఖరారు చేశారు. 
 
ఈ యాత్ర ప్రారంభానికి ముందు వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానిక జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైకాపా పార్టీ నేతలు మినహా మిగిలిన పార్టీలకు చెందిన నేతలంతా హాజరుకానున్నారు. 
 
ముఖ్యంగా, టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో ఇతర చిన్నాచితక పార్టీల నేతలను కూడా ఆహ్వానించారు. తొలి రోజు యాత్ర వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో సమర్పించారు.