1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:27 IST)

జగన్ ఆస్తుల కేసు... కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం న్యాయవాది... వాదిస్తున్నారు...

కాంగ్రెస్ పార్టీలో కీలక మంత్రి పదవులను చేపట్టి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పాత వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఆర్థిక మంత్రి అంటే పి. చిదంబరం అనేట్లు బాగా గుర్తిండిపోయిన చిదంబరం ఇప్పుడు నల్లకోటు వేసుకుని న్యాయవాదిగా కోర్టులో కనిపించే రోజులు కూడా వచ్చేశాయి. తాజాగా ఆయన నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని ఆసక్తిని రేపారు. 
 
కాకపోతే జగన్ మోహన్ తరపున నేరుగా వకల్తా పుచ్చుకోలేదు కానీ జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో లోపాయికారి పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెంట్ కింగ్ పునీత్ దాల్మియా తరపున వాదన చేసేందుకు రంగంలోకి దిగారు. కేసుకు సంబంధించి చార్జిషీటు దాఖలు చేశాక విచారణకు రమ్మంటూ ఈడీ తన క్లయింట్‌ను ఎలా పిలుస్తారంటూ చిదంబరం కోర్టులో వాదన చేశారు. 
 
చిదంబరం చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు దీనికి వివరణనిస్తూ వాదనలు వినిపించాలని ఈడీకి నోటీసులు ఇచ్చింది. కేసును ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు. మరి మిగిలినవారి కేసులను కూడా మెల్లగా చిద్దూ వకల్తా పుచ్చుకుంటారేమో చూడాలి.