గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (10:17 IST)

వ్యక్తిగత ఖజానా నింపుకునే పనిలో జగన్: టీడీపీ

చంద్రబాబునాయుడి హాయాంలో రూ.90వేలకోట్ల పైచిలుకు ఎగుమతులు చేసిన రాష్ట్రం, జగన్ ఏలుబడిలో  అట్టడుగుకుచేరి, ఈశాన్యరాష్ట్రాల సరసన నిలిచిందని, చంద్రబాబు తనకష్టంతో సాధించిన అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనత కూడా జగన్ దేనని టీడీపీనేత, ఆపార్టీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..!  "గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మంచిని, అభివృద్ధిని,సాధించిన ప్రగతిని సర్వనాశనం చేయడం వల్ల ఎగుమతుల్లో రాష్ట్రపరిస్థితి దిగజారింది. ఎగుమతుల సన్నద్దత సూచీ (ఎక్స్ పోర్ట్ ప్రిపేర్డ్ నెస్ ఇండెక్స్-2020)లో ఏపీ 20వ స్థానానికి దిగజారింది. 

మనరాష్ట్రం తర్వాత మేఘాలయ,  మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి ఉన్నాయి.  ఎగుమతుల సన్నద్ధత సూచీ నివేదిక పరిశీలిస్తే జగన్ రాష్ట్రాన్ని ఏవిధంగానాశనంచేశారో, రాష్ట్రం ప్రగతిపరంగా ఎలా దిగజారిపో యిందో తెలుస్తుంది. నివేదికను ఒక్కసారి పరిశీలిస్తే, పాలసీ అమలుకు సంబంధించి-21వ ర్యాంకు, బిజినెస్ ఎకోసిస్టమ్ లో-16వ ర్యాంకు, ఎక్స్ పోర్ట్ ఇకోసిస్టమ్ లో -19వ ర్యాంక్, ఎక్స్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ పిల్లర్ లో మరీ దారుణంగా 27వ ర్యాంకుకి రాష్ట్రం దిగజారడం అత్యంత ఆందోళనకరం. 

సుదీర్ఘ సముద్ర తీరప్రాం తాలుండి, ఎగుమతులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రాలు దేశంలో 8 ఉంటే, వాటిలో7వస్థానంలో రాష్ట్రం ఉందని,  వాటిలో 5 రాష్ట్రాలనుంచే 70శాతం ఎక్స్ పోర్ట్స్ జరుగుతున్నాయి.  మనకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆ 5 రాష్ట్రాల్లో ఉండటం, మనకు నిజంగా సిగ్గుచేటు. ఇటువంటి పరిస్థితి ఏపీకి వచ్చినందుకు జగన్ సిగ్గుతో తలదించుకోవాలి.

ఏటేటా దేశం నుంచి జరిగే ఎగుమతులు పెరుగుతున్నాయని, 2019-20కి 330 మిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే స్థాయికి భారత్ చేరింది.  ఆంధ్రప్రదేశ్ మాత్రం గతేడాది ఎగుమతుల్లో క్షీణించి అథమస్థాయికి చేరి, 20వ ర్యాంకుకి పడిపోయింది. 

దేశ జీడీపీలో 19.07శాతం ఆదాయంఎగుమతుల ద్వారానే వస్తోంది. ఒకదేశ ఆర్థికవ్యవస్థ బలపడటానికి ఎగుమతులు ఎంత అవసరమో దేశస్థాయిలో నమోదవుతున్న అభివృద్ధిద్వారానే తెలుస్తుంది. 23జిల్లాల ఉమ్మడిరాష్ట్రంలో 2013-14లో 92,890 కోట్లవరకు ఎగుమతులుచేయడం జరిగితే, విభజన జరిగాక 13 జిల్లాల కొత్తరాష్ట్రం 2016-17 కాలంలో 80వేల460కోట్లవిలువైన ఎగుమతులు చేసేస్థాయికి ఏపీని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే.

2017-18 కాలానికి దాన్ని 84వేలకోట్లకు చేర్చగా,  2018-19లో  98,983 కోట్లరూపాయల ఎగుమతులుచేసే స్థాయికి  చంద్రబాబు రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఎగుమతుల విలువ రూ.92,890కోట్లయితే, 2018-19నాటికి 13జిల్లాల విభజనరాష్ట్రం 6వేలకోట్లు ఎక్కువగా ఎగుమతులచేసింది. ఉమ్మడి రాష్ట్రంకంటే ఏమాత్రం తీసిపోనివిధంగా ఎక్కువ ఎగుమతులచేసేలా రాష్ట్రాన్ని తయారుచేసింది ఎవరో స్పష్టంగా తెలుస్తోంది.

అలాంటి రాష్ట్రాన్ని 27వస్థానానికి పడిపోయేలాచేసి, పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు-కంపెనీలు లేకుండా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? దేశవ్యాప్తంగా టోటల్ షేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2.08శాతమైతే, ఓవరాల్ ర్యాంకింగ్స్ లో 2018-19లో రాష్ట్రం ఎగుమతుల్లో 9వస్థానంలో నిలిచింది. ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో అభివృద్ధిచేస్తే, దాన్ని నేడుపూర్తిగా భ్రష్టుపట్టించారు.

ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ సెక్టార్నిఅభివృద్ధిచేసి, ఐటీపరిశ్రమలను తీసుకొచ్చి, హైదరాబాద్ ను ఐటీహబ్ గా మార్చింది చంద్రబాబే.   తాము చెప్పేది నమ్మనివారు ఎవరైనా ఉంటే, సోషియో ఎకనామిక్ సర్వేలోని వివరాలను చూసి, వాస్తవాలు తెలుసుకోవచ్చు.  ఈ విధంగా అభివృద్ధిని నాశనం చేసినందుకు వైసీపీనేతలు సంబరాలు చేసుకుంటున్నారా? 

2014-19 కాలంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 635అవార్డులు సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్-1స్థానంతోపాటు, విద్యుత్ రంగంలో 107జాతీయ అవార్డులు, అర్బన్ డెవలప్ మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 91, పంచాయతీరాజ్ విభాగంలో82, ఐటీ సెక్టార్లో 38, హెల్త్ విభాగంలో 50, ఎడ్యుకేషన్లో 33 జాతీయస్థాయి అవార్డులు చంద్రబాబు పాలనలోవచ్చాయి.

జాతీయస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చే ఒక్క పనైనా ఈ 15నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిందా?  చంద్రబాబు నాయుడు రాష్ట్రంకోసం పడిన కష్టం మొత్తాన్ని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వెయ్యికిలోమీటర్ల కోస్తాతీరప్రాంత మున్నా ఏపీ ఎగుమతుల్లో  వెనుకపడిందని,  ఆ రాష్ట్రపనితీరు బాగాలేదని ఎగుమతుల సన్నద్ధత సూచీ నివేదికలో పేర్కొన్నారు.

ఆ నివేదికలో ప్రతి అంశానికి ఆయా రాష్ట్రాల పనితీరుని బట్టి స్కోర్లు ఇచ్చారని, మనరాష్ట్రానికి వచ్చిన స్కోర్లు చూస్తే దిమ్మతిరిగి కిందపడటం ఖాయం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వాలిడ్ పాలసీకి - 0, ఫెసిలిటేటింగ్ మెజర్ – 0, మార్కెటింగ్ సపోర్ట్-0, పాలసీ ఎంఫసిస్ ఆఫ్ ప్రొడక్ట్ క్వాలిటీ-0, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టేట్ సెక్టర్ కోఆర్డినేషన్ సెల్ -0, ఇంటర్నేషనల్ యాక్సెస్ కి పెద్దగుండు సున్నా, ఎయిర్ కార్గో ఫెసిలిటీస్ – 0.

ఇలా చెప్పుకుంటూ పోతే నీతి అయోగ్ ఇచ్చిన స్కోర్ కార్డులో ఏపీకి అన్ని గుండుసున్నాలే మిగిలాయి.  ఈచేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి చివరకు రాష్ట్రాన్ని సున్నాల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు.   దీనిపై జగన్ ఏం చెప్పి తప్పించుకుం టారు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునే జగన్, చదువుకునేటప్పుడు తనకువచ్చిన సున్నామార్కులే అన్ని రంగాల్లో రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాడు.

నంబర్ 1 స్థానంలో ఉండే రాష్ర్టానికి అన్నీ సున్నాలే వచ్చేలా చేశాడు. 12, 13 విభాగాల్లో అన్నింటిలో సున్నాలేనా..! సంవత్సరంన్నరకే ఇన్నిసున్నాలైతే, మిగిలిన మూడేళ్లలో ఇంకెన్ని సున్నాలు మిగులుతాయో ప్రజలే ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య రంగం చాలా కీలకమైంది. అటువంటి ఆరోగ్యరంగానికి, 2019జూన్ లో నీతిఅయోగ్ విడుదల చేసిన నివేదికలో ఏపీ 2వర్యాంక్ సాధించింది.

దేశంలోనే హెల్త్ సెక్టార్లో ఏపీ 2వస్థానంలో నిలిచేలా చేసిన ఘనత చంద్రబాబుగారిది కాదా? అటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు ఎలా తయారైందో చూస్తున్నాం.  టీడీపీ ప్రభుత్వం గతఐదేళ్లలో ఇచ్చిన సబ్సిడీలు, ఇన్సెంటివ్ ల వల్లే రాష్ట్రం అన్నిరంగాల్లో వృద్ధి నమోదుచేసింది. 14-08-2018న జీవోనెం-96ద్వారా ఎగుమతుల వృద్ధికి స్టేట్ ఎక్స్ పోర్ట్ కమిటీని ఏర్పాటు చేయడంద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఎగుమతులను విశేషంగా ప్రోత్సహించింది.

ఎగుమతులకు సంబంధించి ఒక అత్యున్నతమైన పాలసీనికూడా టీడీపీ ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది.  ఆ పాలసీని జగన్ ప్రభుత్వం ఏ అటకమీద పారేసిందో చెప్పాలి. 2016లో రూ.80వేలకోట్ల ఎగుమతులు చేసేరాష్ట్రాన్ని, ఐదేళ్లలోనే రూ.లక్షా61వేలకోట్ల ఎగుమతులచేసే రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో పాలసీ తీసుకురా వడం జరిగింది.

షిప్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ కు ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పవర్ ఛార్జెస్ తగ్గించడం, మినరల్ అండ్ మైన్ ప్రొడక్ట్స్ లో సింగిల్ విండోద్వారా అనుతులివ్వడం వంటి అనేక నిర్ణయాలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ కు ప్రత్యేకనిధులు ఇవ్వడం వంటి నిర్ణయాలు చంద్రబాబు తీసుకోవడం వల్లే రాష్ట్రప్రగతి సాధ్యమైంది. అరకులో పండే కాఫీపంటనుంచి వచ్చే కాఫీ పొడికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. 

ఈ విధంగా అద్భుతమైన ఎక్స్ పోర్ట్ పాలసీని తీసుకొస్తే, దాన్ని ఆచరణలో పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి ఎగుమతుల్లో రాష్ట్రాన్ని 27స్థానానికి ఎందుకు దిగజార్చారు. ఎక్స్ పోర్ట్ పాలసీతో పాటు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు బిల్ ని తీసుకురావడం ద్వారా పోర్టుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టిపెట్టారు. 27-11-2015న జీవో నెం-14ద్వారా ప్రత్యేకంగా పోర్ట్ పాలసీని తీసుకొచ్చారు.

సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ఏపీ నుంచే అనేకరకాల ఎగుమతులు జరిగేలా చేయడంకోసం, గేట్ వే ఆఫ్ ఎక్స్ పోర్ట్స్ గా రాష్ట్రాన్ని తయారు చేయడంకోసం ప్రయత్నించారు. రాష్ట్రంలో ఉన్న 14రకాల మేజర్, నాన్ మేజర్ పోర్టులతో పాటు ఇతరపోర్టులను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు.  శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు, కాకినాడ ఎస్ ఈజెడ్ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల అభివృద్ధికి నాంది పలికింది చంద్రబాబు ప్రభుత్వమే.

పోర్టులుసరిగా లేకపోతే ఎగుమతులు ఎలా జరుగుతాయో జగన్ సమధానం చెప్పాలి.  గుజరాత్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలవడానికి అక్కడున్న పోర్టులే కారణం. మచిలీపట్నం పోర్టుకు వేగంగా భూమిని సేకరించారని, రామాయపట్నం పోర్టునిర్మాణం కోసం ఫేజ్ -1 కింద రూ.4,240కోట్లతో ప్రణాళికవేసి, 3,000 ఎకరాలను సేకరించారు. అదేరోజున పోర్టుకి అనుసంధానంగా ఏషియన్ పేపర్ పల్ప్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు కూడా ఒప్పందం చేసుకున్నారు.

రామాయపట్నం పోర్టు ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు పేపర్  ఎగుమతి చేయాలన్న ఆలోచన చేశారు. ఇండోనేషియాకు చెందిన సైనార్ గ్రూప్ 24వేలకోట్ల పెట్టుబడి పెట్టేలా చేస్తే, ఆపరిశ్రమ ఏమైంది.  ఆ పరిశ్రమ వెనక్కు వెళ్లడానికి కారణం జగన్ కాదా? మారీటైమ్ గేట్ వే అనే అంతర్జాతీయ పోర్టల్ ఎగుమతుల కేంద్రంగా ఏపీ అవతరించబోతోందని ఆనాడు కీర్తించింది. ఇప్పడేమో జగన్ అన్ని సున్నాలు చుట్టి కూర్చున్నా డు.

విజయవాడలో కార్గో టెర్మినల్, విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి నగరాల్లో కూడా టెర్మినళ్లను అభివృద్ధి చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు తయారుచేసింది. విజయవాడ కార్గో టెర్మినల్ నుంచి చిల్లీస్ , మ్యాంగో, ఆక్వా ప్రొడక్ట్స్ విదేశాలకు ఎగుమతులు జరిగాయి. రాజమండ్రి రన్ వేను విస్తరించారు.  ఈ విధంగా ఎగుమతులకు అవసరమైన అన్ని సదుపాయాలు చంద్రబాబు కల్పించారు.

2019నాటికి 168.64 మిలియన్ మెట్రిక్ టన్నులను ఎగుమతిచేసేలా తయారుచేయాలనుకున్నారు.  13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మారిటైమ్ పోర్ట్ బిల్లుని చంద్రబాబు పరిష్కరించారు. 46,690కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ లను కూడా  సాగర్ మాల ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి వచ్చేలా చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కడే.  ఇప్పుడేమో జగన్ రాష్ట్రాన్ని అన్నిస్థానాల్లో అథమానికి చేర్చి, అన్నింటికీ  గుండుసున్నాలు చుట్టారు. రాష్ట్ర్ర ప్రజలందరూ దీనిపై ఆలోచించాలి.

జగన్ తన వ్యక్తిగత ఖజానా నింపుకుంటున్నాడు...
జగన్ నల్లడబ్బుని ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవలే బాలినేని చెన్నైకి ఎలా సూట్ కేసులు తరలించారో అంతకంటే గొప్పగా తన మిత్రులైన కొల్లం గంగిరెడ్డి, (ఎర్రచందనం స్మగ్లర్) గాలి జనార్థనరెడ్డిల సాయంతో ఎర్రచందనం, ఐరన్ వోర్ ల మీద సంపాదించే సొమ్ముమొత్తాన్నిఅక్రమ మార్గాల్లో  విదేశాలకు తరలిస్తూ జగన్ తనవ్యక్తిగత ఖజానా నింపుకుంటున్నాడు. 

చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇప్పటికే ఎగుమతుల అంశంపై మాట్లాడారు. ఎగుమతులకు సంబంధించి తాము చెప్పిన అంకెలు,  ఐదేళ్లలో తమప్రభుత్వం సాధించినప్రగతి తప్పని చెప్పే ధైర్యంగానీ, ఆయా అంశాలపై చర్చకు వచ్చే దమ్ముగానీ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఉన్నాయా?

నీతి వైపే న్యాయం ఉంటుంది....  
నీతీవైపే న్యాయం ఉంటుదనడానికి అచ్చెన్నాయుడి గారి ఉదంతమే నిదర్శనం. తాత్కాలికంగా అన్యాయం పైచేయి సాధించినా, నిజాయితీకి మారుపేరైన అచ్చెన్నాయుడిని ఈ ప్రభుత్వం ఎలా హింసపెట్టి, కరోనాకు గురిచేసిందో చూశాం.

అటువంటి అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం శుభపరిణామం. అచ్చెన్నాయుడికి రూపాయి కూడా అందినట్లు తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఏసీబీ అధికారులే చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణలనుంచి కడిగిన ముత్యంలా అచ్చెన్నాయుడు బయటకు వచ్చితీరుతారు.