మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (07:42 IST)

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ‘అభయం’ యాప్‌ను ప్రారంభించిన జ‌గ‌న్

ప్రజా రవాణా వాహనాల్లో మహిళల రక్షణ కోసం రూపొందించిన 'అభయం‌' యాప్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ‌ర్చువ‌ల్ విధానంలో యాప్‌ను సీఎం జ‌గ‌న్ కంప్యూట‌ర్‌లో బ‌ట‌న్ నొక్కి ప్రారంభించారు.

అనంత‌రం ఆయన మాట్లాడుతూ... ప్రయాణ సమయంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఈ యాప్ దోహదపడుతుందని చెప్పారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రయాణ వాహనాల్లో అభయం యాప్ పరికరాన్ని అమర్చనున్నట్టు తెలిపారు. తొలి విడతగా విశాఖలో వెయ్యి ఆటోల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 5వేల వాహనాలకు, జూలై 1 నాటికి 50వేల వాహనాలకు, నవంబరు నాటికి లక్ష వాహనాలకు అభయం యాప్‌ను విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణంలో మహిళలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే పానిక్ బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం అందుతుందని వివరించారు.

మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వివరించారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశామని సీఎం గుర్తు చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును రాష్ట్రంలో ప్రవేశపెట్టామని వెల్లడించారు.

దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తే, అభయం యాప్‌ను రవాణా శాఖ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఉబర్, ఓలా, ఆటోలు, ట్యాక్సీల్లోనూ ఇదే తరహా పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ‘అభయం ప్రాజెక్టు’ (యాప్‌) ప్రారంభోత్స‌వానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు  హాజరు కాగా, వివిధ జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.

సీఎం జ‌గ‌న్ మాట్లడుతూ ఆర్థిక స్వావలంబన కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల‌తో పాటు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ఏ పథకాన్ని తీసుకున్న కూడా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేమడం వల్ల వారికి ఆర్థిక స్వావలంబన చేకూరే విధంగా చరిత్రలో నిల్చిపోయే ఒక ఘట్టం మన రాష్ట్రంలో జరుగుతుంద‌న్నారు.

ఆర్థిక స్వావలంబనే కాకుండా అన్ని కోణాల్లో కూడా వారి కాళ్ల మీద వారు నిలబడే దిశగా అడుగులు వేస్తూ, నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టాలు చేయ‌డంతో పాటు రాజకీయంగా అక్కా చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆరాటపడే ప్రభుత్వం మనది.

ఒక నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తు అయితే, హోం మంత్రిగా నా చెల్లెలు ఉండడం ఒక ఎత్తు. ఉప ముఖ్యమంత్రిగా మరొక చెల్లెమ్మ ఉండడం, మహిళలను రాజకీయంగా ఎంపవర్‌ చేయడంలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నారు. 
 
సీఎం జ‌గ‌న్ సోదరుడిగా నిల్చారు: మేకతోటి సుచరిత, హోం మంత్రి...
‘మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలలు, మహిళల భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టారు. దిశ చట్టం, సైబర్‌ మిత్ర, మహిళా మిత్రల ద్వారా వారికి భద్రత కల్పిస్తున్నారు. వాటిపై మహిళలతో సహా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో ముందడుగు వేస్తూ, అభయం ప్రాజెక్టు. మహిళలు, చిన్నారుల భద్రతకు ఈ ప్రభుత్వం పెద్ట పీట వేస్తోంది.

ఈ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. పోలీసు శాఖలో ఆ మేరకు సంస్కరణలు కూడా తీసుకువస్తున్నాం. ఏపీ అంటే మహిళలకు ఒక అభయ హస్తం మాదిరిగా, మీరు ఒక సోదరుడిగా నిల్చారు. అందుకు సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అభయం ప్రాజెక్టు కూడా మహిళలు, పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.