శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (17:01 IST)

ఆ నవరత్నాలు.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాయ్..

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 46 ఏళ్ల జగన్ రెడ్డి 175 ఏపీ సీట్లలో 145 సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ 25 సీట్లలో ముందంజలో వుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వైకాపా ముందంజలో వుంది.


ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అత్యధిక సీట్లలో గెలుపును నమోదు చేసుకోవడానికి కారణం ఏమిటనే దానిపై ఆరా తీస్తే.. వైకాపా కార్యాలయం తాడేపల్లి గూడెంకు మారడం గెలుపుకు తొలి మెట్టు అని జనం అనుకుంటున్నారు. అమరావతికి సమీపంలో తాడేపల్లిలో వైకాపా ఆఫీసును ఏర్పాటు చేయడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. 
 
అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించిన నవరత్నాల హామీలు ఆ పార్టీకి గెలుపును సంపాదించిపెట్టాయి. ఇంకా అమరావతి రాజధాని నిర్మాణంలో రియల్ ఎస్టేట్ బిజినెస్, అవినీతి, ఇర్రిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటివి జగన్‌ను గెలిపించాయి. చంద్రబాబు హామీలను నెరవేర్చకపోవడంతో ఓటర్లు జగన్ ప్రకటించిన పథకాలపై ఆకర్షితులయ్యారు. 
 
ముఖ్యంగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర అనుకూల ఫలితాలను ఇచ్చింది. దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి తరహాలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఈ క్రమంలో 3648 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగానే నవరత్నాలు అనే పేరిట తొమ్మిది హామీలు ఇచ్చారు. ఈ నవరత్న పథకాలను జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతుల పథకాలు, వయో ఫించన్లు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కారణాల వల్లే జగన్ రెడ్డి ఏపీలో అత్యధిక సీట్లతో ముందంజలో వున్నారు.