బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (19:17 IST)

అసెంబ్లీ సమావేశాలకు అడ్డొచ్చిన కరోనా.. టెన్త్ పరీక్షలకు రాదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలకు అడ్డొచ్చిన కరోనా వైరస్ పదో పరీక్షలు నిర్వహించేందుకు అడ్డురాదని పాలకులు చెప్పడం వింతగా ఉందన్నారు. దీనికి కారణం విద్యార్థులకు ఓట్లు లేకపోవడమేనని పవన్ విమర్శలు గుప్పించారు. 
 
ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. పొరుగు రాష్ట్రాలో తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. కానీ, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరాల్సిందేనన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. 
 
దీనిపైన పవన్ కళ్యాణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. కరోనా సాకుతో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులకు కుదించిందని, కానీ, అదే సర్కారు పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎంతో తెలివైనదని ట్వీట్ చేశారు. 
 
టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండదన్న విషయం తెలుసు కాబట్టే కరోనా రోజుల్లోనూ పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు, 'పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా విలువైనవే' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.