1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (13:29 IST)

పార్టీలోని ఇన్‌చార్జులంతా గొట్టంగాళ్లే.. కేశినేని నాని

kesineni nani
టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై నోరు పారేసుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇన్‌ఛార్జులంతా గొట్టంగాళ్లేనంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తే తనకు ఆహ్వానం లేదన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్లారని గుర్తుచేశారు. 
 
ఇన్‌ఛార్జుల పేరుతో హడావుడి చేసేవాళ్లంతా గొట్టంగాళ్లని విమర్శించారు. ఢిల్లీకి చంద్రబాబు వస్తున్నట్లు సమాచారం రావడంతో బాధ్యతగా వెళ్లి కలిశానన్నారు. బీజేపీ - టీడీపీ పొత్తుపై స్పందించే స్థాయి తనది కాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల మధ్య జరిగిన భేటీపై తాను ఏమీ స్పందించనని స్పష్టం చేశారు. 
 
తాను టీడీపీ సభ్యుడిని మాత్రమేనని, ఎటువంటి పదవులూ లేవన్నారు. ప్రజాప్రతినిధిగా గెలిచాక ప్రాంతం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా. నా గురించి ఎవరేం అనుకున్నా పట్టించుకోను. ప్రజలు కోరుకుంటే పార్టీ సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలు నాతో కంఫర్టబుల్‌గా ఉన్నారన్నారు. పైగా, నియోజకవర్గంలో తన పట్ల సానుకూల దృక్పథంతో పాటు మంచి పేరుంది కాబట్టే తన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని అన్నారు.