శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (08:30 IST)

ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి కేఎఫ్ డబ్ల్యూ బ్యాంకు రూ.1735 కోట్లు రుణం

రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయన్ని మరింత విస్తరించేందుకు తోడ్పాటును అందించేందుకు జర్మనీ ప్రభుత్వానికి చెందిన కెఎఫ్ డబ్ల్యూ బ్యాంకు బైలేట్రల్ డెవలప్ మెంట్ బ్యాంకు రూ.1735 కోట్ల రుణం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కెఎఫ్ డబ్ల్యూ బ్యాంకు ప్రతినిధులు గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం (జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్)ను విస్తరించే ప్రక్రియలో భాగంగా క్లైమేట్ రిసిలియెంట్ ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 2వేల 479 కోట్ల రూ.ల అంచనాతో కూడిన ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కెఎఫ్ డబ్ల్యూ నుండి ఋణం తీసుకునేందుకు కేంద్రం ఆమోదం తెలపగా రూ.1735 కోట్ల రుణం అందించేందుకు కెఎఫ్ డబ్ల్యూ బ్యాంకు ఆసక్తి కనబర్చగా  మిగతా 30 శాతం నిధులు అనగా రూ.744 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది.

ఇందుకు సంబంధించి వచ్చే అక్టోబరులో కెఎఫ్ డబ్ల్యూ బ్యాంకు ఆమోదం తెలపనుండగా వచ్చే నవంబరులో కెఎఫ్ డబ్ల్యూ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఆ ఒప్పందం జరిగిన తదుపరి నవంబరు నెల నుండి రుణం విడుదల కానుంది. కెఎఫ్ డబ్ల్యూ బ్యాంకు రెండు దశల్లో ఈ రుణాన్ని అందించనుంది. మొదటి దశలో రూ.744 కోట్లు, రెండవ దశలో రూ.900 కోట్ల రుణం విడుదల చేయనుంది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాల్లో విస్తరించనున్నారు.

అనగా 1,725 గ్రామ పంచాయితీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా 7 లక్షల మంది రైతులు ఈ విధానం కింద  సాగుచేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. అంతేగాక ప్రకృతి సేద్యాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా 25 వేల మంది మాస్టర్ రైతులను కమ్యూనిటీ రిసోర్సు పర్సన్ (సీఆర్పీ)లను తయారు చేయడంతో పాటు 69 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను దీనిలో భాగస్వాములను చేయడం జరుగుతుంది. అలాగే రిసోర్సు గ్రామ పంచాయితీలు, ట్రైబల్ రిసోర్సు క్లస్టర్లు, న్యూ కేడర్ ఫెలోషిప్పులుగా చేపట్టడం జరుగుతుంది.

అంతేగాక పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సైన్స్ అండ్ గ్లోబల్ నాలెడ్జి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా టెక్నికల్ సపోర్టు మరియు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ టీం ద్వారా దీనిని విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సలహాదారు టి.విజయకుమార్, వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి మదుసూధన్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, కెఎఫ్ డబ్ల్యూ బృందం ఆండ్రూ జోన్ స్టన్, ప్రిన్సిపల్ ప్రాజెక్టు మేనేజర్ ఐరిస్ హార్దర్ తదితరులు పాల్గొన్నారు.