1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (18:26 IST)

చంద్రబాబుకు ఆడవారి ఉసురు తగులుతుంది : కొడాలి నాని

ఒక రోజు తిరుపతి పర్యటనలో భాగంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తిరుపతిలో భువనేశ్వరి చేసిన కామెంట్స్ ప్రకారమే.. చెడు వ్యాఖ్యలు చేసినవారు ఎవరి పాపాన వారు పోతారని మంత్రి కొడాలి అన్నారు. పైగా, ఆమె వ్యాఖ్యలను చంద్రబాబుకే వదిలివేస్తానని చెప్పారు. 
 
ముఖ్యంగా, కుటుంబ సభ్యులే కాదు చివరకు భార్య పేరును కూడా రాజకీయాల్లో వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఆమె శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని కొడాలి నాని జోస్యం చెప్పారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లను రోడ్డుపైకి తెచ్చింది ఎవరు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆడవాళ్ల ఉసురు తగలడం ఖాయమని, వచ్చే ఎన్నికల తర్వాత ఇపుడున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. 
 
కాగా, తిరుపతిలో ఇటీవల సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48 మంది మృతుల కుటుంబాలకు నారా భువనేశ్వరి సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా తనపై ఏపీ అసెంబ్లీలో వైకాపా మంత్రులు, సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.