1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:21 IST)

అమరావతి సభకు వచ్చిన ఆర్ఆర్ఆర్ - ఘన స్వాగతం పలికిన రైతులు

తిరుపతి పట్టణ వేదికగా అమరావతి రైతులు చేపట్టిన భారీ బహిరంగ సభకు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ఆయనకు అమరాతి రైతులు ఘన స్వాగతం పలికారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, దగాపడిన రైతు సభ అని అన్నారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాల వారు తరలివస్తున్నారన్నారు. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని, ఈ విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు. 
 
నవ్యాంధ్రకు అమరావతే శాశ్వత రాజధాని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మంచివాడని తాను చెప్పనని, కానీ చెడ్డవాడు మాత్రం కాదని చెప్పారు. ఎవరో చెప్పమన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. 
 
మరోవైపు, అమరావతి రైతు బహిరంగ సభకు రాలేమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఈ మేరకు ఆయన అమరావతి జేఏసీకి ఆయన లేఖ రాశారు. 
 
ఈ సభకు తనను ఆహ్వానించినందుక ధన్యవాదాలని చెబుతున్నామన్నారు. అయితే, అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంకా ఉన్న బీజేపీతో తాము వేదికను పంచుకోలేమని చెప్పారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.