శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (12:04 IST)

కరోనా దెబ్బకు ఆర్ఎంవో మృతి.. వైరస్ నుంచి కోలుకున్న ఎమ్మెల్యే అంబటి

కృష్ణా జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంవోగా పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ యోగేంద్రబాబు (59) కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు 15 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయనను విజయవాడలోని కొవిడ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆ.న... కోలుకుంటున్నట్టే కనిపించారు. కానీ, బుధవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. 'మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.