సుపరిచితులతోనా... జర భద్రం బిడ్డా...! అని చెప్పండి.. ఏం? ఎందుకు?
పిల్లల్ని, అమ్మాయిలను తెలిసిన వారితో పంపుతున్నారా...! ఆగండి కాస్త ఆలోచించండి.. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే సగటున రెండు రోజులకు ఒక అత్యాచారం జరుగుతోంది. ఇవిఆషామాషీగా చెప్పే మాటలు కావండీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతున్న చేదు నిజాలు. అత్యాచారాల మాట అలా ఉంటే.. ఆ అత్యాచారాలలో చాలా ఎక్కువ తెలిసిన వాళ్ళు చేసినవేనట. అందుకే ఇవన్నీ తెలుసుకున్న తరువాత మీ అంతట మీరే జాగ్రత్త పడతారు. రండీ ఇంకాస్త లోతుగా విషయమేంటో తెలుసుకుందాం...
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2014 లెక్కల ప్రకారం.. అత్యాచారం కేసుల్లో ఆంధ్రప్రదేశ్లో 87 శాతం, తెలంగాణలో 71 శాతం కేసులు తెలిసినవారి వలన జరిగినవేనట. అంటే వారే నిందితులుగా ఉన్నారు. ఏపీలో 961 మంది మహిళలపై అత్యాచారాలు జరగ్గా, తెలంగాణలో 979 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. లైంగిక దాడికి గురైన వారిలో సగానికి ఎక్కువ మంది బాలికలే ఉన్నారు.
ఏపీలో సగటున రోజుకు రెండు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని గణాంకాలు తేల్చాయి. 2014లో మొత్తం 961 అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అత్యాచార బాధితుల్లో 838 మంది (87.2) శాతం మంది నిందితులకు తెలిసినవారే కావడం ఆశ్చర్యకరమైన విషయం.