సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (15:40 IST)

నందిగం సురేశ్‌కు మరిన్ని కష్టాలు.. మహిళ హత్య కేసులో రిమాండ్

Nandigam
వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. తాజాగా ఆయనను మరో కేసులో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఆయన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు వెలగపూడిలోని మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కూడా ఆయన హస్తం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
 
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో ఉంటున్న నందిగం సురేశ్‌ను పోలీసులు తాజాగా వెలగపూడి మహిళ మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేశారు. 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.